
అమెరికాతో కాల్పుల విరమణ ప్రతిపాదనలకు సంబంధించిన షరతులు బెడిసి కొట్టిన తర్వాత.. ఇరాన్ విజృంభిస్తోంది. గల్ఫ్ రీజియన్ అమెరికా మిత్రదేశాలపై విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో తాజాగా కువైట్ పై మిస్సైళ్లను సంధించింది. వైమానిక దాడులను తీవ్రతరం చేసింది. బహ్రెయిన్‌లో కూడా దాడులు జరిగినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ పరిణామాలు కాల్పుల విరమణకు అతిపెద్ద సవాలుగా నిలిచాయి.బోట్సువానా జాతీయ పతాకంతో ఇరాన్‌కు వెళ్తున్న ఓ ఖాళీ చమురు ట్యాంకర్‌ను అమెరికా సైన్యం అడ్డుకున్న కొద్దిసేపటికే ఈ దాడులు చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ తాజా దాడులు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని సాగింది. ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు, వరుస క్షిపణుల దాడిలో కువైట్ ఎయిర్ పోర్ట్ టెర్మినల్ 1 భారీగా దెబ్బతింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు అందుతున్నాయి.దాడి అనంతరం విమాన సర్వీసులన్నింటినీ కూడా నిలిపివేశారు. కువైట్ కు రావాల్సిన కొన్ని విమానాలను ఇతర గమ్యస్థానాలకు మళ్లించారు. దాడి వల్ల మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని కువైట్ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (DGCA) ప్రకటించింది. దీనిపై కువైట్ న్యూస్ ఏజెన్సీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ దాడిని కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ సవూద్ అబ్దుల్‌అజీజ్ అల్ ఒటాయిబి నిర్ధారించారు. ఎయిర్ పోర్ట్ టెర్మినల్ 1ను ఇరాన్ లక్ష్యంగా చేసుకుందని అన్నారు.ఈ ఘటన చోటు చేసుకున్న వెంటనే అత్యవసర సహాయక బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించాయి. గాయపడిన వారి వివరాలు, వారి ఆరోగ్య పరిస్థితిపై గానీ, లేదా విమానాశ్రయ కార్యకలాపాల పునరుద్ధరణపై గానీ అధికారులు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. గతంలో కూడా కువైట్ ఎయిర్ పోర్ట్ ధ్వంసానికి గురైన విషయం తెలిసిందే. మరమ్మతులు పూర్తి చేసుకుని, దశలవారీ పునఃప్రారంభమైంది. ఈ నెల 1 నుంచి విమానాశ్రయం కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది.ఈ లోపే మరోసారి ఇరాన్ దాడి చేయడం చర్చనీయాంశమైంది. అమెరికా-ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం 96వ రోజుకు చేరుకుంది. సంఘర్షణ మొదలైన తర్వాత కువైట్ పౌర మౌలిక సదుపాయాలపై జరిగిన అత్యంత ముఖ్యమైన సంఘటనలలో ఇదీ ఒకటి. కాగా బహ్రెయిన్‌పై కూడా దాడులు చేసిన ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్స్ వెల్లడించింది. ఈ క్షిపణులను ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అడ్డుకున్నాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది.