translateexpand_more

Panchayati Raj Infrastructure News

Latest updates from Telugu Digital news sources.

Oneindia Telugu02 Jun, 11:18 am
జిల్లాల్లో 525 ఘాట్లు, మెగా సిటీగా రాజమండ్రి

అత్యంత ప్రతిష్టాత్మకమైన గోదావరి పుష్కరాలు-2027 నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి నుంచే భారీ కసరత్తు ప్రారంభించింది. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అఖండ గోదావరి అభివృద్ధి ప్రాజెక్టు, పుష్కరాల ఏర్పాట్లపై మంత్రుల కమిటీ, వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి ఒక సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. పుష్కరాలను అత్యంత వైభవంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు వీలుగా అన్ని శాఖలు పూర్తి సమన్వయంతో, ప్రణాళికాబద్ధంగా పని చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలోనే సీఎం ఒక కీలక ప్రకటన చేస్తూ.. 2027 గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు.ఈ పనులు కేవలం పుష్కరాల రోజులకు మాత్రమే పరిమితం కాకూడదని, ప్రస్తుతం కల్పించే మౌలిక వసతులు భవిష్యత్తులో గోదావరి పరివాహక ప్రాంతానికి శాశ్వత ఆస్తిగా మారాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ పుష్కరాల ద్వారా రాజమహేంద్రవరం వంటి చారిత్రాత్మక నగరం ఒక మెగాసిటీగా రూపాంతరం చెందేలా శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని సూచించారు. ఇటీవల ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి చేసిన విలువైన సూచనలను, సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని ఈ పనులను ముందుకు తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. పోలవరం, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ సహా మొత్తం ఆరు జిల్లాల పరిధిలో ఈ పుష్కరాల పనులు ముమ్మరంగా సాగనున్నాయి.6 జిల్లాల్లో 525 ఘాట్లు.. రికార్డు స్థాయిలో నిధుల కేటాయింపు!రాష్ట్రంలో 212 కిలోమీటర్ల పొడవునా ప్రవహిస్తున్న గోదావరి నది పరివాహక ప్రాంతంలో.. పోలవరం జిల్లా గుండాలలో మొదటి పుష్కర ఘాట్ ఏర్పాటు కానుంది. అలాగే కోనసీమ జిల్లా అంతర్వేది, బలుసుతిప్ప, కాకినాడలోని గోవాలంక, పశ్చిమగోదావరిలోని నర్సాపురంలో చివరి ఘాట్లను నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొత్తం ఆరు జిల్లాల్లో రికార్డు స్థాయిలో 525 ఘాట్లను భక్తుల కోసం అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 288 ఘాట్లను ఆధునీకరిస్తూనే, కొత్తగా మరో 237 ఘాట్లను నిర్మించనున్నారు. దీనివల్ల ప్రస్తుతం ఉన్న 4.5 కిలోమీటర్ల ఘాట్ల పొడవు కాస్తా.. భవిష్యత్తులో 9.9 కిలోమీటర్లకు పెరగనుంది. అత్యధికంగా తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లోనే 150కి పైగా ఘాట్ల నిర్మాణం జరగనుంది.గోదావరి పుష్కరాల ముహూర్తం, నిర్వహణ పై ప్రభుత్వం కీలక ప్రకటన..!!ఈ భారీ మౌలిక సదుపాయాల కల్పన కోసం మున్సిపల్ శాఖ పరిధిలో రాజమహేంద్రవరం, నర్సాపురం సహా వివిధ పట్టణాల్లో రూ.1,974 కోట్ల వ్యయంతో 1,660 పనులు, అలాగే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో రూ.1,080 కోట్ల విలువైన 1140 పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే ప్రాథమికంగా రూ.211.97 కోట్లకు సంబంధించి 132 పనులకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు కూడా మంజూరు చేసింది.10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా.. ఒక్కరోజే కోటి మంది!గత పుష్కరాల గణాంకాలను పరిశీలిస్తే భక్తుల సంఖ్య అసాధారణంగా పెరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1991లో 1.2 కోట్ల మంది, 2003లో 5 కోట్ల మంది, ఆ తర్వాత 2015 నవ్యాంధ్రప్రదేశ్‌లో 4.86 కోట్ల మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. గతంలో ఒక్క రోజులో అత్యధికంగా 58.26 లక్షల మంది రాగా.. ఈసారి 2027 పుష్కరాల్లో ఏకంగా 9 నుంచి 10 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాల కోసం తరలివస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అంతేకాదు, అత్యున్నత రద్దీ ఉన్న రోజున ఒక్కరోజే దాదాపు 1 కోటి మంది భక్తులు స్నానాలు ఆచరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ భారీ జనసందోహాన్ని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, శానిటేషన్ (పరిశుభ్రత), నిరంతర తాగునీటి సరఫరా, భక్తుల రక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను అప్రమత్తం చేశారు.Godavari Pushkaralu: కుంభమేళాలా గోదావరి పుష్కరాలు-ఏపీ సర్కార్ నిర్ణయాలు..!ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్, బీసీ జనార్ధన్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, పి.నారాయణ, హోం మంత్రి వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, వాసంశెట్టి సుభాష్‌లతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) జి.సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మరియు దేవాదాయ, వైద్యారోగ్యం, ఆర్థిక, జలవనరుల శాఖల ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Panchayati Raj Infrastructure News Keyword | Telugu Digital