
రీతూ చౌదరి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకున్న సెలెబ్రిటీ. గ్లామర్, వివాదాలు ఇలా పలు అంశాలు ఆమెకి క్రేజ్ తీసుకువచ్చాయి. బుల్లితెరపై రీతూ చౌదరి తన ప్రయాణం మొదలు పెట్టింది. టీవీ షోలు చేసింది, హోస్ట్ గా రాణించింది. ఇప్పుడు సినిమాల్లో సైతం అవకాశాలు అందుకుంటోంది. ఇటీవల విడుదలైన 'మేము కాప్ లం' అనే వెబ్ సిరీస్ లో రీతూ చౌదరి కీలక పాత్రలో నటించింది. మేము కాప్ లం సిరీస్ లో మెగా బ్రదర్ నాగబాబు, గెటప్ శ్రీను లాంటి వారు కీలక పాత్రల్లో నటించారు. జీ 5లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ కి క్రేజీ రెస్పాన్స్ దక్కుతోంది. ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో ఈ సిరీస్ రూపొందింది. బివిఎస్ రవి ఈ సిరీస్ ని నిర్మించారు. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా బివిఎస్ రవి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆయన మేము కాప్ లం సిరీస్ గురించి మాట్లాడుతున్న సమయంలో రీతూ చౌదరి గురించి ప్రస్తావన వచ్చింది. రీతూ చౌదరిని అంటే అందరూ గ్లామర్ రోల్ లో చూపించాలి అని అనుకుంటారు. మీరెందుకు ఆమెని గ్లామరస్ గా చూపించలేదు. కథ నుంచి పక్కకు వెళ్లకుండా నార్మల్ గానే ఆమె రోల్ చూపించారు అని యాంకర్ అన్నారు. దీనిపై బివిఎస్ రవి స్పందిస్తూ.. నేను రీతూ చౌదరిని ఎప్పుడూ గ్లామర్ పరంగా చూడలేదు. ఎందుకంటే అసలు రీతూ చౌదరి ఎవరో నాకు తెలియదు. మన సిరీస్ కి రీతూ చౌదరిని ఎంపిక చేశారు అని చెప్పగానే ఓకె అయితే ఏంటి అన్నాను. ఆమె సెట్ లోకి వస్తుంటే రీతూ చౌదరి వస్తోంది అంటూ హంగామా చేశారు. రీతూ చౌదరి వస్తుంటే వీళ్లంతా ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు అని నేను షాక్ అయ్యా. రాగానే హాయ్ సార్ అని అంది. ఆమె నాకు తెలియదు, అయినా కూడా హాయ్ చెప్పింది. డైరెక్టర్ సన్నివేశం చెబితే వెంటనే పాత్రలోకి ప్రవేశించి చాలా చక్కగా చేసింది. ఈ అమ్మాయి చాలా బాగా చేస్తోందే అని ఇంప్రెస్ అయినట్లు బివిఎస్ రవి తెలిపారు. ఆమె పాత్రకి ఏది అవసరమే అదే చేయించాం. గ్లామర్ అవసరం లేదు, ఆ చర్చ కూడా జరగలేదు అని బివిఎస్ రవి అన్నారు. పల్లెటూరిలో చిన్న టీవీ స్టేషన్ లో పనిచేసే అమ్మాయిలు అలాగే సింపుల్ గా బట్టలు వేసుకుంటారు. అందుకే ఆమె పాత్రని గ్లామర్ యాంగిల్ లో చూపించలేదు అని బివిఎస్ రవి అన్నారు.