translateexpand_more

Smuggling Operation News

Latest updates from Telugu Digital news sources.

AP7AM03 Jun, 02:09 am
ప్రమాదంతో బట్టబయలైన గంజాయి స్మగ్లింగ్.. లారీలో భారీ డంప్

ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం, భారీ గంజాయి అక్రమ రవాణా గుట్టును రట్టు చేసింది. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా, పోలీసులు జరిపిన తనిఖీల్లో లారీలో దాచిన సుమారు 500 కిలోల గంజాయి బయటపడింది.వివరాల్లోకి వెళితే, ఒంగోలులోని కిమ్స్ హాస్పిటల్ సమీపంలో జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. సాంకేతిక సమస్యతో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే తీవ్ర గాయాలతో మరణించాడు. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడి నుంచి పరారవ్వడం పోలీసులకు అనుమానం కలిగించింది.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, అనుమానంతో లారీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. లారీలో ఉన్న తవుడు బస్తాల కింద భారీ మొత్తంలో గంజాయి ప్యాకెట్లు దాచి ఉంచినట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి బరువు సుమారు 500 కేజీలు ఉంటుందని, దీని విలువ లక్షల రూపాయలలో ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్‌తో పాటు ఈ అంతర్రాష్ట్ర స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ తో సంబంధం ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. ఒడిశా వంటి ప్రాంతాల నుంచి దక్షిణ రాష్ట్రాలకు గంజాయి రవాణా చేసేందుకు ఈ మార్గాన్ని స్మగ్లర్లు ఉపయోగిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.