ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యానికి సంబంధించి రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. త్వరలోనే మార్కెట్లోకి కొత్తగా 150 ఎంఎల్, 200 ఎంఎల్ పరిమాణంలో మద్యం బాటిళ్లను తీసుకురానున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 90, 180, 375, 750, 1000 ఎంఎల్ లిక్కర్ బాటిల్స్ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా మద్యం సరఫరా చేసే కంపెనీలు సరికొత్త ఆలోచన చేశాయి. 150 ఎంఎల్, 200 ఎంఎల్ పరిమాణంలో బాటిల్స్ అందుబాటులోకి తీసుకొస్తామని ప్రతిపాదించాయి.. ఎక్సైజ్శాఖ కొన్ని సవరణలు తీసుకొచ్చింది. ఇకపై ఒక కేసులో 200 ఎంఎల్ బాటిళ్లు 45, 150 ఎంఎల్ బాటిళ్లు 60 ఉంటాయి. ఈ కొత్త లిక్కర్ బాటిళ్లకు సంబంధించి.. ఐఎంఎఫ్ఎల్ (చౌకమద్యం) రూల్స్ను సవరిస్తూ ఎక్సైజ్శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్కుమార్ మీనా ఉత్తర్వులు జారీచేశారు. సాధారణంగా లిక్కర్ షాపుల్లో ఎక్కువ మంది క్వార్టర్ సీసాలే కొనుగోలు చేస్తుంటారు. అంతకంటే తక్కువ లిక్కర్ చాలనుకుంటే అందులో సగం 90ఎంఎల్ ఉంది. ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్న 150, 200 ఎంఎల్ బాటిల్స్ ధర కొంత తగ్గుతుందని.. కాబట్టి ఎక్కువ మంది వీటిని కొనుగోలు చేసే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం ఉన్న ధరలే కొత్త పరిమాణంలోని సీసాలకూ వర్తిస్తాయి కాబట్టి అమ్మకాల్లో మార్పులొచ్చే అవకాశం ఉంది అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులు, బార్ల దగ్గర బ్రాండ్లకు సంబంధించిన ప్రకటనల బోర్డులు, హోర్డింగులు, ఫ్లెక్సీలు నిషేధించాలని ఎక్సైజ్శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు. ఒకవేళ ఇప్పటికే బోర్డులు, హోర్డింగులు, ఫ్లెక్సీలు ఉంటే వాటిని తొలగించాలన్నారు. మంత్రి ఆదేశాలు మేరకు ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాలు జారీచేశారు. మద్యం షాపులు, బార్ల యజమానులు ఈ ప్రభుత్వ ఆదేశాలకు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో మద్యం షాపులు, బార్ల దగ్గర ఏదో ఒక బ్రాండ్ పేరుతోనే బోర్డులు, హోర్డింగులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారన్నారు. ఆ బ్రాండ్లను ప్రచారం చేసుకోవడానికి బ్రాండ్ పేరుతో పాటుగా షాపు, బార్ లైసెన్స్ తీసుకున్న పేరుతో కలిపి బోర్డులు ఏర్పాటు చేస్తున్నారన్నారు. అయితే నిబంధనల ప్రకారం మద్యం బ్రాండ్లను ప్రచారం చేయకూడదన్నారు అధికారులు. కానీ మద్యం బ్రాండ్ కంపెనీలన్నీ ప్రచారం కోసం.. అదే బ్రాండ్ పేరుతో సోడా, మంచినీళ్లు అమ్మేలా రిజిస్ర్టేషన్ చేసుకుంటాయని గుర్తు చేశారు. మద్యం షాపులు, బార్ల దగ్గర ఏర్పాటు చేసే బ్రాండ్ పేరు పెద్దగా చూపించింది.. మంచినీళ్లు, సోడా అని ప్రింట్ చేస్తారని ఆరోపించారు. అందుకే మద్యం షాపులు, బార్ల దగ్గర ఆయా కంపెనీలు వారి బ్రాండ్ పేరుతో ఉచితంగా బోర్డులు ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు. ఈ బోర్డులు, హోర్డింగులు, ఫ్లెక్సీలు నిషేధం అమలుకు మద్యం దుకాణాలు, బార్ల యాజమాన్యాలు సహకరించాలని కోరారు.