
సూర్య కెరీర్లో తొలిసారి రూ.200 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమా 'కరుప్పు'. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా నడుస్తూ రూ.300 కోట్ల వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది. ఇప్పుడు రూ.269కోట్లు రాబట్టింది. ఈ జోష్లో ఉన్న అభిమానులకు సూర్య మరో ట్రీట్ ఇవ్వబోతున్నాడు. కొత్త సినిమాతో అలరించేందుకు వస్తున్నారు. ఆయన నటించిన తెలుగు సినిమా రిలీజ్ కి రెడీ అయ్యింది. సూర్య తదుపరి సినిమా 'విశ్వనాథ్ అండ్ సన్స్'. ఇది తెలుగు సినిమా కావడం విశేషం. `రక్తచరిత్ర` తర్వాత సూర్య నటించిన తెలుగు సినిమా ఇదే కావడం మరో విశేషం. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యకు జోడీగా మమితా బైజు నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. కొన్ని నెలల క్రితం ఫస్ట్ లుక్ పోస్టర్లు, తర్వాత టీజర్ రిలీజ్ చేసి హైప్ పెంచారు. ఆ టీజర్లో సినిమా జులైలో వస్తుందని చెప్పారు. 'కరుప్పు' ఫీవర్ ఇంకా తగ్గకముందే, సూర్య తర్వాతి సినిమా అప్డేట్ రావడంతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. 'కరుప్పు' లాగే 'విశ్వనాథ్ అండ్ సన్స్' కూడా పెద్ద హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. దీనికి దర్శకుడు వెంకీ అట్లూరి ట్రాక్ రికార్డే కారణం. ఆయన గత చిత్రాలు 'సార్', 'లక్కీ భాస్కర్' బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూలు చేశాయి. ఈ జాబితాలో ఈ సినిమా కూడా చేరుతుందని ఆశిస్తున్నారు.