
ప్రజల్లో నమ్మకం, విశ్వసనీయత ఉంటేనే ఏ వ్యవస్థ అయినా మనుగడ సాగిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. గుంటూరు జిల్లా (Guntur District) తక్కెళ్లపాడులో లలిత పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ లలిత ఆసుపత్రి (Lalitha Hospital) ల్యాండ్ మార్క్ ఇన్స్టిట్యూట్గా తయారు కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఎంత సంపద ఉన్నా ఆరోగ్యం లేకపోతే లాభం ఉండదు. సంపూర్ణ ఆరోగ్యం ఉన్నవారే నిజమైన ధనవంతులు. వేల కోట్లు, పదవులు ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదు. లలిత ఆసుపత్రి 600 పడకల సామర్థ్యంతో 900 మంది సిబ్బందితో ప్రారంభమైంది. 32 విభాగాలకు వైద్య సేవలు అందించే ఏకైక కేంద్రమిది. సంజీవిని పేరుతో డిజిటల్ హెల్త్ రికార్డు (Digital Health Record) ప్రాజెక్టును తీసుకొస్తున్నాం. పేదవాళ్ల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మంచి అలవాట్లతో అనారోగ్యం మన దరి చేరదు. యోగా, ధ్యానం వంటి వాటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని రక్షిస్తుంది అని తెలిపారు.