18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ 2025 సీజన్లో తొలిసారి విజేతగా నిలిచింది. ఆ తర్వాతి సీజన్ అంటే ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026లో టైటిల్ నిలబెట్టుకుంది. దీంతో వరుసగా రెండు ఐపీఎల్ టైటిల్స్ సాధించిన మూడో జట్టుగా అవతరించింది. ఈ రెండు సార్లు ఆర్సీబీ కెప్టెన్గా రజత్ పటీదార్ ఉన్నాడు. ఐపీఎల్ 2022 సందర్భంగా మరో ఆటగాడు గాయపడటంతో రీప్లేస్మెంట్గా ఆర్సీబీలోకి వచ్చిన పటీదార్.. ఆ జట్టు రాతను మార్చేశాడు. విరాట్ కోహ్లీ, అనిల్ కుంబ్లే, డేనియల్ విటోరీ, రాహుల్ ద్రవిడ్ లాంటి ప్లేయర్లకు సాధ్యం కాని టైటిల్ను జట్టుకు అందించాడు.ఆర్సీబీకి వరుసగా రెండు టైటిల్స్ అందించినప్పటికీ రజత్ పటీదార్కు రావాల్సినంత పేరు రాలేదని ఆస్ట్రేలియా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ మైకెల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. అతడు భారత జట్టు తరఫున ఆడేందుకు అర్హుడని పేర్కొన్నాడు.“ఆర్సీబీ కెప్టెన్గా రజత్ పటీదార్ మరోసారి అదరగొట్టాడు. అతడు స్టార్ క్రికెటర్ కాదు. ఏది ఏమైనా విరాట్ కోహ్లీ ఆర్సీబీ జట్టులో ఉండటంతో అందరూ అతడి గురించే మాట్లాడతారు. కానీ ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. పటీదార్ కెప్టెన్గా ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టాడు. వ్యక్తిగతంగా కూడా మిడిల్ ఆర్డర్లో అదిరే ఆటతీరు కనబరిచాడు. భారత టీ20, వన్డే జట్టులో పటీదార్కు చోటు కల్పించే విషయంపై చర్చ జరగాలి” అని మైకెల్ క్లార్క్ వ్యాఖ్యానించాడు.“రజత్లో నాయకత్వ లక్షణాలున్నాయి. దానికి తోడు మిడిల్ ఆర్డర్లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు. టీ20ల్లో ఫోర్త్ ప్లేసులో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. భారత్లో ప్రస్తుతం ఎంతోమంది ప్రతిభగల క్రికెటర్లు ఉన్నారు. వారంతా భారత జట్టులో చోటు కోసం పోటీలో ఉంటారు. కానీ వరుసగా 2 ఐపీఎల్ టైటిల్స్ అందించిన కెప్టెన్ రజత్ను సెలక్టర్లు తప్పకుండా దృష్టిలో ఉంచుకుంటారు. టీ20, వన్డేల్లో అతడిని ఆడించాలి” ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ వ్యాఖ్యానించాడు.
Michael Clarke On Rajat Patidar News
Latest updates from Telugu Digital news sources.
Samayam Telugu03 Jun, 04:59 pm
ఆర్సీబీ రాత మార్చిన రజత్ పటీదార్ కు గుర్తింపు ఎక్కడ