translateexpand_more

Pawan Kalyan On Supports Telangana News

Latest updates from Telugu Digital news sources.

Samayam Telugu03 Jun, 05:34 am
వారంతా తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తే.. నేను బహిరంగంగా మద్దతు తెలిపా

తెలంగాణ కేంద్రంగా కొద్దిరోజులుగా రాజకీయాలు వేడెక్కాయి. ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌పై ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు.. ఆ తర్వాత ఏర్పాటు చేసిన జనసేన సభతో హీట్ మరింత పెంచింది. తెలంగాణ రాజకీయ పార్టీల నేతల నుంచి వస్తున్న విమర్శలకు పవన్ కళ్యాణ్ మంగళవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కౌంటరిచ్చారు. తాజాగా పవన్ కళ్యాణ్ మరోసారి ఆసక్తికర ట్వీట్ చేశారు. తెలంగాణపై తన స్టాండ్ ఏంటో గతంలోనే చెప్పానంటూ ఓ వీడియోను ట్వీట్ చేశారు. 'తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో నా నిబద్ధత ఇటీవల మొదలైంది కాదు. 2009లో ప్రజారాజ్యం పార్టీ యువరాజ్యం విభాగానికి నాయకత్వం వహిస్తున్నప్పుడు.. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి నాయకులు, గద్దర్ గారితో కలిసి తెలంగాణ సామాజిక న్యాయ సభలో పాల్గొన్నాను. దివంగత వైఎస్ఆర్ గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న సమయంలో.. నేను తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు బహిరంగంగా మద్దతు తెలిపాను. సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు అనే పునాదులపై నిర్మించబడిన సామాజిక తెలంగాణ కోసం పిలుపునిచ్చాను. నేను రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణకు నా మద్దతు ఇవ్వలేదు. ప్రజల ప్రజాస్వామ్య ఆకాంక్షలు గుర్తింపు, గౌరవానికి అర్హమైనవనేనని నా దృఢ విశ్వాసం, నమ్మకంతో నేను మార్గనిర్దేశం చేశాను. అప్పుడు నేను తీసుకున్న వైఖరి తెలంగాణ, ప్రజల పట్ల నా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. తెలంగాణ రాష్ట్ర సాధనకు నా మద్దతు రాజకీయపరమైన అంశం కాదు, అది ఒక సూత్రప్రాయమైన విషయం' అంటూ పవన్ కళ్యాణ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. అంతకముందు పవన్ కళ్యాణ్ ప్రముఖ కవి శేషేంద్ర రచించిన కవితను ట్వీట్ చేశారు. 'ఏ రస్తా యుద్ధాలు చేస్తుందో''ప్రాణాల్ని ఆటబంతుల్లా''విసిరేస్తుందో''గెలుస్తుందో ఓడుతుందో''కానీ ముందుకు పోతుందో''అదే నా రస్తా''ఏ రస్తాలో సంకెళ్లు కూడా''సవాల్ చేస్తాయో''ఏ రస్తాలో అపజయం కూడా''అగ్నిజ్వాలై మండుతుందో''ఏ రాస్తాలో మరణం''మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో''అదే నా రాస్తా' అంటూ పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.జనసేన పార్టీ ప్రస్థానం తెలంగాణలోనే మొదలైందని.. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతుంటే ఊరుకునేది లేదన్నారు పవన్ కళ్యాణ్. తనకు తెలంగాణ నాయకులపై ఎలాంటి ద్వేషం లేదని.. కానీ కొందరు హైదరాబాద్‌ ఎలా వస్తావని మాట్లాడటం సరికాదన్నారు. తనను బెదిరించడానికి కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ జనాల్ని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. తాను బెదిరింపులకు భయపడే వాడిని కాదని.. తాను ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందన్నారు. తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందని.. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానన్నారు. వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో పాటుగా 2029 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగా పోటీచేస్తుందని ప్రకటించారు. జనసేనతో బీజేపీ, టీడీపీ కలుస్తాయో లేదో వాళ్ల ఇష్టమన్నారు.