
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బోర్డు చైర్మన్ రాహుల్ సింగ్, సెక్రటరీ హిమాన్షు గుప్తాలను కేంద్ర ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 12వ తరగతి పరీక్షలకు సంబంధించి కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్స్క్రీన్ మార్కింగ్ (OSM) విధానంలో తీవ్రమైన లోపాలు తలెత్తడం, రీ-ఎవాల్యుయేషన్ పోర్టల్పై సైబర్ దాడి జరగడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.ఈ ఏడాది నుంచి అమల్లోకి తెచ్చిన డిజిటల్ మూల్యాంకన ప్రక్రియలో అనేక సమస్యలు ఎదురైనట్లు విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. సమాధాన పత్రాలు సరిగా కనిపించకపోవడం, పేజీలు మాయమవడం, దిద్దకుండా వదిలేయడం, ఒకరి జవాబు పత్రానికి మరొకరికి మార్కులు వేయడం వంటి పొరపాట్లు జరిగాయి. దీనికి తోడు, జూన్ 2న ప్రారంభమైన రీ-ఎవాల్యుయేషన్ పోర్టల్పై కొద్ది నిమిషాల్లోనే భారీ సైబర్ దాడి జరిగింది. దాదాపు 15 లక్షల హిట్స్తో డినైయల్-ఆఫ్-సర్వీస్ దాడి చేసి, లక్షకు పైగా లాగిన్ ప్రయత్నాలు చేసినట్లు అధికారులు గుర్తించారు.ఈ వివాదాల నేపథ్యంలో, ఓఎస్ఎం సేవల సేకరణ, అమలుపై విచారణ జరిపేందుకు కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్పర్సన్ ఎస్. రాధా చౌహాన్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించి, అవసరమైన దిద్దుబాటు చర్యలు చేపడతామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హామీ ఇచ్చారు.