
తిరుపతి రైల్వేస్టేషన్లో సీసీ కెమెరాల్లేని కారణంగా భద్రతా విభాగం అయోమయ పరిస్థితిలో ఉంది. తిరుపతి: తిరుపతి రైల్వేస్టేషన్లో సీసీ కెమెరాల్లేని కారణంగా భద్రతా విభాగం అయోమయ పరిస్థితిలో ఉంది. ప్రపంచ పుణ్యక్షేత్రం కావడంతో దేశం నలుమూలల నుంచి ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటోంది. రోజూ 70వేల నుంచి 80వేలమంది రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం 2022లో ప్రపంచ స్థాయి రైల్వేస్టేషన్ పనులు ప్రారంభించింది. ఇందుకోసం పాత భవనాలను తొలగించడంతో ప్లాట్ఫామ్స్కు ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల అనుసంధానం ఎక్కడికక్కడ తెగిపోయాయి. ప్రధాన ద్వారాలున్న ఒకటో నెంబరు ప్లాట్ఫామ్కు కొన్ని సీసీ కెమెరాలు తాత్కాలికంగా అమర్చారు. అవి కూడా మొక్కుబడిగానే పనిచేస్తున్నాయి. మిగిలిన 2, 3, 4, 5 నెంబర్లతోపాటు నూతనంగా నిర్మించిన 6వ నెంబరు ప్లాట్ఫామ్పై ఒక్కటంటే ఒక్క సీసీ కెమెరా అమర్చలేదు. రైల్వేస్టేషన్కు 425 సీసీ కెమెరాలు అవసరమని భద్రతా విభాగం రైల్వేబోర్డుకు ప్రతిపాదించడంతో అనుమతులు లభించినట్లు సమాచారం. అయితే వీటి ఏర్పాటు పనులు ఇప్పటికీ ప్రారంభించక పోవడమేంటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.