
భారత్ కు సరిహద్దు దేశాలైన చైనా, పాకిస్థాన్ తో ఎప్పుడూ ప్రమాదం పొంచి ఉంటుంది. గతేడాది పహల్గామ్ ఉగ్రదాడి సమయంలో పాకిస్థాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్ కు చైనా ఆయుధాలు సరఫరా చేసిన విషయం తెలిసిందే. కానీ వాటిని భారత్ క్షిపణులు ధ్వంసం చేశాయి. ఈ నేపథ్యంలో భారత రక్షణ రంగంలో కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. భారత వాయి సేన కోసం రూ. 3.25 లక్షల కోట్ల అంచనా వ్యయంతో 114 రఫేల్ విమానాలను కొనుగోలు చేయడానికి ఫ్రాన్స్ ప్రభుత్వానికి భారత్ అధికారిక అభ్యర్థన లేఖ పంపింది.ఈ ఒప్పందంలో భాగంగా మొత్తం 114 విమానాలలో 94 రఫేల్ విమానాలను ఫ్రాన్స్ కు చెందిన డస్సాల్ట్ ఏవియేషన్ సంస్థ ఒక భారతీయ భాగస్వామ్య సంస్థతో కలిసి భారత్ లోనే అభివృద్ధి చేయనుంది. ఫ్రాన్స్ వెలుపల రఫేల్ విమానాలు తయారు చేయడం ఇదే తొలిసారి. ఇందులో దాదాపు 50 శాతం స్వదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నారు. భారత రక్షణ మంత్రిత్వ శాఖ పంపిన ఈ ప్రతిపాదనకు రాబోయే 2 నుండి 3 నెలల్లో ఫ్రాన్స్ ప్రభుత్వం స్పందించే అవకాశం ఉంది. రాబోయే ఏడాది కాలంలో ఈ చర్చలు ముగిసి ఒప్పందం ఖరారు అయ్యే అవకాశం ఉంది.ప్రస్తుతం భారత వాయు సేన ఎదుర్కొంటున్న యుద్ద విమానాల స్క్వాడ్రన్ల కొరతను తీర్చడానికి ఈ 4.5 జనరేషన్ అధునాతన రఫేల్ విమానాలు చాలా కీలకం కానున్నాయి. ఇప్పటికే భారత వాయుసేన, నౌకాదళం కలిపి 62 రఫేల్ విమానాలను ఆర్డర్ చేశాయి. ఇప్పుడు కొత్తగా వచ్చే 114 రఫేల్ యుద్ధ విమానాలతో కలిపి ఈ సంఖ్య 176 కు చేరుతుంది. అదనంగా భారత నౌకాదళం కూడా మరో 31 రఫేల్ విమానాలను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తోంది. అదే జరిగితే భారత్ మొత్తం రఫేల్ విమానాల సంఖ్య 200 దాటుతుంది.మరోవైపు జూన్ లో ప్రధాని నరేంద్రమోదీ ఫ్రాన్స్ లో పర్యటించే అవకాశం ఉంది. ఈ సమయంలో ఇరు దేశాల మధ్య జరిగే చర్చల్లో రఫేల్ ఒప్పందం కీలకంగా మారనుంది. ఇదిలాఉండగా ప్రస్తుతం భారత వాయుసేన అధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ కూడా ఫ్రాన్స్ లో పర్యటిస్తున్నారు. ఇక భారత ప్రభుత్వం తాజా నిర్ణయం చైనా, పాకిస్థాన్ లకు షాక్ ఇచ్చిందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.