
– 38 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన దర్శకుడిగా ఎస్వీ కృష్ణారెడ్డికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ నుంచి వరల్డ్ రికార్డ్ గుర్తింపు – ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహిస్తున్న 43వ సినిమా “వేదవ్యాస్” మేకింగ్ వీడియో లాంఛ్ సకుటుంబ కథా చిత్రాలతో తెలుగు తెరకు మిరుమిట్లు గొలిపే విజయాలు అందించిన దిగ్దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి ప్రస్తుతం తన 43వ సినిమా “వేదవ్యాస్” రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కె . అచ్చిరెడ్డి సమర్పణలో నూతన నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి తన సాయి ప్రగతి ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో పిడుగు విశ్వనాథ్ హీరోగా అరంగేట్రం చేస్తుండగా…కొరియన్ నటి జూన్ హ్యూంజీ, మంగోలియన్ నటుడు షరన్ బోల్డ్ సెగ్మెంట్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు. “వేదవ్యాస్” సినిమా ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ రోజు దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి 75వ జన్మదినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో పుట్టినరోజు వేడుకలతో పాటు “వేదవ్యాస్” సినిమా మేకింగ్ వీడియో లాంఛ్ చేశారు. 38 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన దర్శకుడిగా ఎస్వీ కృష్ణారెడ్డికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ నుంచి వరల్డ్ రికార్డ్ గుర్తింపు పత్రాన్ని అందజేశారు. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి మాట్లాడుతూ – ఎస్వీ కృష్ణారెడ్డి గారు గొప్ప దర్శకులు. మంచి మనసున్న వ్యక్తి. ఆయన సకుటుంబంగా చూసే ఎన్నో అద్భుతమైన చిత్రాలు రూపొందించారు. ఆ సినిమాలన్నీ వినోదంతో పాటు సమాజానికి సందేశాన్ని కూడా చెప్పాయి. పిల్లల నుంచి పెద్దల దాకా ఎస్వీ గారి సినిమాలను ఆస్వాదించారు.
