translateexpand_more

Brs Government News

Latest updates from Telugu Digital news sources.

Samayam Telugu02 Jun, 12:59 am
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం రేవంత్, కేసీఆర్ స్పెషల్ ట్వీట్స్, ఎవరేమన్నారంటే

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ (జూన్ 2) పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని గుర్తు చేసుకుంటా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన ప్రవాస తెలంగాణ బిడ్డలకు హృదయపూర్వక ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎందరో మహానుభావుల సుదీర్ఘ పోరాటాలు, ఉద్యమ స్ఫూర్తి, అమరవీరుల త్యాగాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించిన ముఖ్యమంత్రి.. వారి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయం, ఆర్థిక పురోగతి దిశగా అడుగులు వేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణను దేశంలోనే సంక్షేమ, అభివృద్ధి రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ముఖ్యంగా రైతుల సంక్షేమం, మహిళా సాధికారత, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పనతో పాటు విద్య, వైద్య రంగాలు, మౌలిక సదుపాయాల కల్పనకు తమ పాలనలో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పాలనను అందిస్తూ.. ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ అభివృద్ధి ఫలాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ పునర్నిర్మాణ ప్రక్రియలో రాష్ట్ర ప్రజలందరూ ఐక్యంగా, సౌభ్రాతృత్వంతో భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు.తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం రాష్ట్ర ప్రజలకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అందజేశారు. దశాబ్దాల పాటు సాగిన అణచివేత, వివక్షపై శాంతియుతమైన, ప్రజాస్వామ్యయుతమైన పార్లమెంటరీ పంథాలో పోరాడి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని ఆయన గుర్తుచేశారు. నాడు ఉమ్మడి పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన తెలంగాణను, స్వయం పాలనలో కేవలం పదేళ్ల అనతికాలంలోనే దేశానికే ఒక దిక్సూచిలా మార్చగలిగామని ప్రకటించారు. పరిపాలన చేతగాదన్న విమర్శకుల నోళ్లు మూతపడేలా.. సకల జనుల సంక్షేమం, సమస్త రంగాల సమగ్ర ప్రగతితో తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.సాగునీరు, తాగునీరు, ఉచిత విద్యుత్, వ్యవసాయం వంటి రంగాల్లో సాధించిన అద్భుత విజయాల వల్ల ఒకప్పుడు ఎడారిలా ఉన్న తెలంగాణ, నేడు కోటి ఎకరాల మాగాణంగా మారి యావత్ దేశానికి అన్నపూర్ణగా నిలిచిందని కేసీఆర్ వివరించారు. అయితే.. ప్రస్తుత తరుణంలో తెలంగాణ సాధించుకున్న అస్తిత్వం, ప్రగతి ప్రమాదంలో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ప్రతీప శక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ రక్షణ కవచంగా నిలుస్తుందని పునరుద్ఘాటించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ప్రస్తుత పాలకులు చిత్తశుద్ధితో నెరవేర్చాలని, రైతుల సంక్షేమాన్ని విస్మరించకూడదని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రం నిరంతరం పచ్చని పాడిపంటలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కేసీఆర్ ఆకాంక్షించారు.