translateexpand_more

Business Article News

Latest updates from Telugu Digital news sources.

Eenadu02 Jun, 03:01 am
పరికరాల తయారీ రంగానికి శుభవార్త

ఇంటర్నెట్‌డెస్క్‌: వ్యవసాయం, పరిశ్రమల్లో వాడే ఉపకరణాల దిగుమతుల విషయంలో అమెరికా (USA) అధ్యక్షుడు ట్రంప్‌ (Trump) కొంత మెత్తబడ్డారు. వాటిపై విధించిన టారిఫ్‌లను 25% నుంచి 15%కు తగ్గించారు. ఈ తగ్గింపు వచ్చే ఏడాది చివరివరకు ఉండనుంది. దీంతో హార్వెస్టర్ల వంటి యంత్రాలు, ఇతర పరికరాలకు వర్తించనుంది. వ్యవసాయ రంగంలో పెట్టుబడికి అండగా ఉండేందుకు.. ఉత్పత్తిదారుల వ్యయాలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ట్రంప్‌ కార్యవర్గం పేర్కొంది. దీంతోపాటు తాజాగా సుంకం తగ్గింపు వర్తించే పరికరాల పరిధిని కూడా గణనీయంగా పెంచింది. పారిశ్రామిక రంగంలో వాడే బుల్‌డోజర్లు, ఫోర్క్‌ లిఫ్ట్‌లు వంటి వాటి దిగుమతులు మరింత చౌక కానున్నాయి. అమెరికాతో ఇప్పటికే వాణిజ్య ఒప్పందాలు చేసుకొన్న దేశాలకు కూడా ఈ తగ్గింపు వర్తిస్తుంది. తమ దేశ లోహరంగంలో ఉత్పత్తి పెంచాలన్న లక్ష్యాన్ని పూర్తి చేయడానికి అమెరికా మరో తాయిలాన్ని ప్రకటించింది. విదేశీ తయారీ సంస్థలు ఏవైనా మూలధన పరికరాలను దిగుమతి చేసుకొంటే.. వాటి బరువులో 85% అమెరికా నుంచి దిగుమతి చేసుకొన్న స్టీల్‌, అల్యూమినియం వంటివి వినియోగిస్తే.. 10% సుంకం మాత్రమే వర్తిస్తుంది. ఈ తగ్గింపులు మొత్తం డిసెంబర్‌ 2027 వరకు కొనసాగుతాయని శ్వేతసౌధం వెల్లడించింది. అమెరికా పారిశ్రామిక రంగం పునర్‌ నిర్మాణానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని తెలిపింది. అమెరికా జాతీయ భద్రత కోసం అధ్యక్షుడు విదేశాల నుంచి అల్యూమినియం, స్టీల్‌, కాపర్‌ దిగుమతిపై టారిఫ్‌లు విధించినట్లు వివరణ ఇచ్చింది. అమెరికా పరిశ్రమలు, వ్యాపారులను విదేశీ చౌకబారు దిగుమతుల నుంచి కాపాడటానికి చర్యలు తీసుకొన్నట్లు వెల్లడించింది. భారత్ నుంచి మహీంద్రా అండ్‌ మహీంద్రా, టీఏఎఫ్‌ఈ, శక్తిమాన్‌, ఫీల్డ్‌కింగ్‌, జైన్‌ ఇరిగేషన్‌ వంటి సంస్థలు అమెరికాకు వ్యవసాయ పరికరాలను ఎగుమతి చేస్తాయి. ట్రంప్‌ తాజా నిర్ణయంతో భారత పరిశ్రమలకు కొంతమేరకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.