
ప్రపంచ జనాభాలో దాదాపు సగం మందికి వరి ప్రధాన ఆహారం. దీన్ని పండించడానికి భారీగా నీరు అవసరం. వాతావరణ మార్పుల వల్ల వర్షపాతంలో లోటుపాట్లు వరి దిగుబడులపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో కరవును తట్టుకునే, అతి తక్కువగా నీటిని వినియోగించే వరి రకాలను కనుగొనేందుకు శాస్త్రవేత్తలు ఏళ్లుగా శ్రమిస్తున్నారు. ఈ విషయంలో గణనీయ పురోగతి సాధించినట్లు చైనా శాస్త్రవేత్తలు ప్రకటించారు. బ్రిటన్ సైతం ఈ దిశగా కీలక అడుగులు వేస్తోంది. వేడెక్కుతున్న నేటి ప్రపంచంలో.. వ్యవసాయానికి ఇదో శుభవార్త. కరవును తట్టుకోగలిగి, తక్కువ నీటితో వరి పండడానికి దోహదపడే కీలకమైన హెచ్ఎంజీబీ1 జన్యువును చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. మొత్తం 16 వరి రకాల(సగం మెట్ట, సగం నీటిపారుదల)పై అధ్యయనం చేసి, వాటి వేర్లు, జన్యు కార్యకలాపాలను విశ్లేషించారు. వేర్ల అభివృద్ధికి దోహదపడే 376 జన్యువులను గుర్తించారు. ఇందులో హెచ్ఎంజీబీ1 వీరి పరిశోధనలో ప్రధాన పాత్ర పోషించింది. వేర్ల పెరుగుదలను ఈ జన్యువు నెమ్మదింపజేస్తుంది. నీటి కోసం భూమి లోతుల్లోకి వెళ్లే వేర్లకు అడ్డుకట్ట వేస్తుంది. పొడి ప్రాంతాల్లో మనుగడ సాగించేలా మందపాటి వేర్లు పెరగడానికి ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. వేర్లు నిటారుగా భూమిలోకి చొచ్చుకుపోవడానికి హెచ్ఎంజీబీ1 జన్యువు బ్రేకులా అడ్డుకట్ట వేస్తుంది కాబట్టి ఉన్నచోటే ఆ వేర్లు మందంగా, బలంగా తయారవుతాయి. ఇది మొక్కకు కరవును తట్టుకునే శక్తిని బాగా పెంచుతుందని ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ ప్రచురించింది. యాదృచ్ఛికంగా మొక్కలను సంకరం చేయడానికి బదులుగా, నిర్దిష్ట జన్యువులను లక్ష్యంగా చేసుకుని ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈ పరిశోధన దోహదపడుతుంది. హువాజోంగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం బీజీఐ-రీసెర్చ్, యునాన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో పాలుపంచుకున్నారు. వాతావరణ మార్పులను తట్టుకునే జన్యు వైవిధ్య వరి మొక్కల