translateexpand_more

Hyderabad Metro Rules Violation News

Latest updates from Telugu Digital news sources.

Samayam Telugu03 Jun, 05:17 am
ప్రయాణికుడి తిక్క కుదిర్చిన హైదరాబాద్ మెట్రో.. అలా కూర్చున్నందుకు ఫైన్, పోలీస్ కేసు నమోదు

ప్రజా రవాణా వ్యవస్థలైన మెట్రో ట్రైన్లు, బస్సుల్లో ప్రయాణించేటప్పుడు కనీస పౌరస్పృహ, బాధ్యత కలిగి ఉండాలని అధికారులు నెత్తినోరూ కొట్టుకొని చెబుతున్నా కొందరు ప్రయాణికుల్లో మార్పు రావడం లేదు. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తూ.. ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేసేలా ప్రవర్తిస్తున్నారు. అలాంటి ఓ ప్రయాణికుడికి హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు షాక్ ఇచ్చారు. ఫైన్ విధించటంతో పాటు పోలీసు కేసు కూడా నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. నాగోల్ నుంచి రాయదుర్గం వైపు వెళ్లే మెట్రో ట్రైన్‌లో రెండ్రోజుల క్రితం చైతన్య అనే ప్రయాణికుడు ప్రయాణించాడు. అయితే తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా తన కాలును కిటికీ అద్దంపై ఆనించి అనాగరికంగా ప్రవర్తించాడు.ట్రైన్‌లో ప్రయాణిస్తున్న తోటి ప్రయాణికులు అతడి తీరును గమనించి.. ఇది పద్ధతి కాదని, కాలు కిందకు దించాలని అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే.. సదరు ప్రయాణికుడు ఏమాత్రం సిగ్గులేకుండా.. రివర్స్‌లో వారితోనే వాదనకు దిగాడు. తాను ఇలాగే కూర్చుంటానని.. ఏం చేసుకుంటారో చేసుకోండనే పద్ధతిలో దురుసుగా సమాధానమిచ్చాడు. దీంతో విసిగిపోయిన ఒక ప్రయాణికుడు ఈ తతంగం మొత్తాన్ని తన మొబైల్‌లో రికార్డ్ చేయడమే కాకుండా.. వెంటనే మెట్రో రైలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అప్రమత్తమైన అధికారులు సమాచారాన్ని రాయదుర్గం మెట్రో స్టేషన్ భద్రతా సిబ్బందికి చేరవేశారు.ట్రైన్ రాయదుర్గం స్టేషన్‌కు చేరుకోగానే ముందే సిద్ధంగా ఉన్న పోలీసులు, మెట్రో సెక్యూరిటీ సిబ్బంది ఆ ప్రయాణికుడిని పట్టుకున్నారు. అతనిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై హైదరాబాద్ మెట్రోరైలు లిమిటెడ్ జీఎం సెక్యూరిటీ శ్రీనాథ్‌ రెడ్డి స్పందిస్తూ.. నిందితుడిని నగరానికే చెందిన చైతన్యగా గుర్తించామని చెప్పారు. మెట్రోరైలు నిబంధనలు ఉల్లంఘించి తప్పుడు ప్రవర్తనకు పాల్పడినందుకు చట్టం ప్రకారం రూ.250 జరిమానా విధించినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి పనులు పునరావృతం కాకుండా హెచ్చరించామన్నారు.ఇదిలా వుండగా.. సదరు ప్రయాణికుడు పౌరస్పృహ లేకుండా ప్రవర్తించిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన వందలాది మంది నెటిజన్లు, నిత్యం మెట్రోలో ప్రయాణించే వారు ఆ వ్యక్తిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. మెట్రో వంటి ఆధునిక రవాణా వ్యవస్థల్లో ఇలాంటి అనాగరిక పనులు చేయడం సరికాదని మండిపడ్డారు. రూ.250 జరిమానా చాలా తక్కువని, ఇలాంటి ప్రవర్తన కలిగిన వ్యక్తులను మళ్లీ ఎప్పుడూ మెట్రో రైళ్లలోకి రాకుండా జీవితకాలం నిషేధించాలనే డిమాండ్లు కూడా నెటిజన్ల నుంచి వ్యక్తమవుతున్నాయి.