
<p><strong>కోల్కతా:</strong> 'పోరాటమో.. మరణమో' తేల్చుకుంటామంటూ టీఎంసీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) మంగళవారంనాడు కోల్కతాలో భారీ ధర్నాకు దిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి రోడ్లపైకి వచ్చారు. పార్టీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, కల్యాణ్ బెనర్జీపై దాడులకు నిరసనగా ఈ ధర్నా చేపట్టారు. అయితే ఇంత పెద్ద కార్యక్రమానికి ఆరుగురు ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు మాత్రమే హాజరుకావడం తాజాగా చర్చనీయాంశమవుతోంది.</p><div id="articlebodyAdsDiv"></div><br/><p>అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అధికారం కోల్పోయినప్పటికీ 80 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది. అయితే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారనే కారణంగా ఇద్దరు ఎమ్మెల్యేలను మమతా బెనర్జీ ఇటీవల సస్పెండ్ చేశారు. దీంతో ఎమ్మెల్యేల సంఖ్య 78కి చేరింది. వీరిలో ఆరుగురు ఎమ్మెల్యేలు... నయన దాస్ బెనర్జీ, మదన్ మిత్రా, ఫిర్హాద్ హకీమ్, బిమన్ బెనర్జీ, అశోక్ దేబ్, సోవన్దేబ్ చటోపాధ్యాయ్ మాత్రమే మమతా బెనర్జీ నిరసన దీక్షలో పాల్గొన్నారు. టీఎంసీకి పార్లమెంటు ఉభయసభల్లో 41 మంది ఎంపీలు ఉన్నారు. అయితే ఐదుగురు ఎంపీలు..డెరిక్ ఒబ్రెయిన్, సమీరుల్ ఇస్లామ్, దోలా సేన్, మాలా రాయ్, కల్యాణ్ బెనర్జీ మాత్రమే నిరసన వేదిక వద్ద కనిపించారు. ఎన్నికల్లో ఓటమి పాలైన చాంద్రిమ భట్టాచార్య, అఖిల్ గిరి, తన్మయ్ ఘోస్లు పార్టీ అధినేత్రి పక్కనే నిరనన కార్యక్రమంలో పాల్గొన్నారు.</p><div id="btwArticleBodyAdsDiv_1"></div><br/><p><strong><span style="color: #da0b0b">సంక్షోభంలో..?</span></strong></p><p>కాగా, అభిషేక్ బెనర్జీపై దాడి అనంతరం మమతాబెనర్జీ నివాసంలో గత ఆదివారం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేల సమావేశంలో 80 మంది ఎమ్మెల్యేలకు గాను కేవలం 20 మందే హాజరయ్యారు. దీంతో ఆ సమావేశం రద్దయింది. ఎంపీలపై దాడి నేపథ్యంలో చాలామంది ఎమ్మెల్యేలు అందుబాటులో లేరంటూ పార్టీ వివరణ ఇచ్చింది. అయితే పార్టీలో పెరుగుతున్న విభేదాలు, అంసతృప్తులే మెజారిటీ ఎమ్మెల్యేల గైర్హాజరుకు కారణమని చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే టీఎంసీ రెబల్ ఎమ్మెల్యేలు మంగళవారంనాడు కోల్కతాలోని ఎమ్మెల్యే హాస్టల్లో సమావేశం కావడం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది. తమదే అసలు పార్టీ అంటూ 'అస్లీ తృణమూల్' పేరిట కొత్త పార్టీ ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. టీఎంసీ అధికారిక సమావేశానికి గైర్హాజరైన 60 మంది ఎమ్మెల్యేలలో 50 మందికి పైగా ఎమ్మెల్యేలు 'అస్లీ తృణమూల్' వైపు మొగ్గుచూపుతున్నారని చెబుతున్నారు. తాజాగా మమతా బెనర్జీ నిరసన దీక్షలో కేవలం వేళ్లపై లెక్కపెట్టుకునే సంఖ్యలో ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ పరిణామం సైతం పార్టీ సంక్షోభం దిశగా పయనిస్తోందనే సంకేతాలనిస్తోందని పలువురు విశ్లేషిస్తున్నారు.</p><br/><p><strong><span style="color: #1961f0">ఇవి కూడా చదవండి..</span></strong></p><p><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/national/jarkiholi-and-siddaramaiah-son-among-10-set-to-take-oath-with-shivakumar-tomorrow-avr-1529049.html"><strong><span style="color: #ed0c0c">10 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం చేయనున్న డీకే.. కొలిక్కి వచ్చిన మంత్రివర్గ కూర్పు</span></strong></a></p><p><a target="_blank" rel="" href="https://www.andhrajyothy.com/2026/national/annamalai-meets-amit-shah-after-submitting-resignation-to-bjp-chief-avr-1529046.html"><strong><span style="color: #ed0c0c">అమిత్షాను కలిసిన అన్నామలై.. ఊపందుకున్న కొత్త పార్టీ ప్రచారం</span></strong></a></p><div id="btwArticleBodyAdsDiv_3"></div>