
తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాలపై ఈ వర్షాల ప్రభావం ఉండనుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండతో కలిపి మొత్తం 18 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు 'ఆరెంజ్' అలర్ట్ ప్రకటించారు. ఈ భారీ వర్షాలతో పాటు బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులు సంభవించే ప్రమాదం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరోవైపు, దేశవ్యాప్తంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు రేపటిలోగా కేరళ, తమిళనాడు తీరాలను తాకనున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి నుంచే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రాత్రంతా ఎడతెరిపి లేకుండా వాన కురిసింది. రాబోయే రెండు రోజులు మరిన్ని భారీ వర్షాల సూచన ఉన్నందున, ముఖ్యంగా రైతులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.