translateexpand_more

Rohit Sharma News

Latest updates from Telugu Digital news sources.

Zee Telugu02 Jun, 11:31 am
ఐపీఎల్ 2026 సీజన్ హైలెట్స్.. ఈ 7 వీడియోలు తప్పక చూడండి

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. IPL 2026 Top Viral Moments: ఐపీఎల్ 2026 సీజన్ అద్భుతంగా ముగిసింది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 155 పరుగులు చేయగా.. విరాట్ కోహ్లీ 75 పరుగుల నాటౌట్‌గా నిలిచి ఆర్‌సీబీని విజేతగా నిలిపాడు. కోహ్లీ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా, వైభవ్ సూర్యవంశి 'ప్లేయర్ ఆఫ్ ది సీజన్'గా ఎంపికయ్యారు. ఈ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ తన ఆటతీరుతో ఆద్యాంతం అభిమానులను అలరించాడు. ఈ సీజన్‌లో అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని ఏడు విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఒకే రీతిలో హిట్ వికెట్ అవ్వడం అభిమానులకు చాలా కాలం గుర్తిండిపోతుంది. ఐపీఎల్ చరిత్రలోనే కాదు.. క్రికెట్ చరిత్రలో కూడా ఇలా ఎన్నడూ జరగలేదు. ఐపీఎల్‌లో మొత్తం మూడుసార్లు హిట్ వికెట్ అయిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా సాయి సుదర్శన్ నిలిచాడు. క్వాలిఫయర్ 1లో ఆర్‌సీబీపై, క్వాలిఫయర్ 2లో రాజస్థాన్ రాయల్స్‌పై సాయి సుదర్శన్ చేతిలో నుంచి బ్యాట్ జారిపోయి వికెట్లను తాకింది. దీంతో బ్యాట్‌కు చేయికి పట్టి కట్టించి ఆడించాలంటూ రకరకాల మీమ్స్‌ వైరల్ అయ్యాయి. — Sanjeev । సంజీవ్ 🇮🇳 (@sanjusayz) May 30, 2026 విరాట్ కోహ్లీ మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్లపై ఎప్పుడు దూకుడుగా ఉంటాడు. ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్ సందర్భంగా కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ట్రావిస్ హెడ్‌తో చిన్నపాటి వాగ్వాదం జరిగింది. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం కోహ్లీతో ట్రావిస్ హెడ్ కరచాలనం చేయసేందుకు ప్రయత్నించినా.. కోహ్లీ అతను నిరాకరించాడు. ట్రావిస్ హెడ్ భార్యపై కూడా కోహ్లీ అభిమానులు దారుణంగా ట్రోల్స్ చేశారు. క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో ఆర్‌సీబీ బౌలింగ్ సమయంలో అంపైర్‌తో విరాట్ కోహ్లీ సరదా పని అందరిని నవ్వించింది. ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 254 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం మైదానంలోకి రాగానే కోహ్లీ బౌలింగ్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు.. అంపైర్ చేతికి తన టోపీని ఇచ్చాడు. మొదటి ఓవర్ నిజంగా కోహ్లీ వేస్తాడా అని అంపైర్ ఆశ్చర్యపోగా.. నిజానికి అంపైర్‌ను సరదాగా ఆటపట్టించాడు. కోహ్లీ, అంపైర్ మధ్య జరిగిన ఈ వీడియో వైరల్ అయింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్ విన్యాసాలతో అద్భుతాలు సృష్టించాడు. ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్ల క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేశాడు. అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును తృటిలో చేజార్చుకున్నాడు. ఎలిమినేటర్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 28 బంతుల్లో 97 పరుగులతో ఉన్న సమయంలో భారీ షాట్ ఆడేందుకు యత్నించి వికెట్ కోల్పోయాడు. ఆ బంతి బౌండరీకి వెళ్లిపోయి ఉంటే 29 బంతుల్లో సెంచరీ బాదిన తొలి ప్లేయర్‌గా రికార్డు సృష్టించేవాడు. వైభవ చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడినా.. తీవ్రంగా నిరాశ చెందాడు. సీజన్‌కు ముందు గేల్ 30 బంతుల రికార్డును బ్రేక్ చేయాలనుకుంటున్నట్లు చెప్పిన వైభవ్.. రికార్డుకు చేరువగా వచ్చాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌ తరువాత కృనాల్ పాండ్యా కాలర్‌ను నికోలస్ పూరన్ పట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే వారిద్దరి మధ్య ఎలాంటి గొడవ ఏం జరగలేదు. ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్‌తో అలా సరదగా పూరన్ కాలర్ పట్టుకున్నాడు. ఇద్దరు కలిసి లక్నో టీమ్‌కు ప్రాతినిధ్యం వహించారు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఎలక్ట్రిక్ సిగరేట్ తాగడం ఈ సీజన్‌లో సంచలనం రేకెత్తించింది. ఈ ఘటనపై బీసీసీఐ స్పందించి.. పరాగ్‌పై చర్యలు తీసుకుంది. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ మంచి ఆటతీరును కనబర్చింది. నాలుగో స్థానంతో ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న రాజస్థాన్.. ఎలిమినేటర్‌ పోరులో ఎస్‌ఆర్‌హెచ్‌ను ఓడించింది. క్వాలిఫైయర్-2 గుజరాత్‌పై వైభవ్ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడినా.. రాజస్థాన్ ఓటమిపాలు కావడం అభిమానులను బాధించింది. ఐపీఎల్ 2026లో మనీష్ పాండే పట్టిన క్యాచ్‌కు బెస్ట్ అవార్డు లభించింది. అయితే ఈ రేసులో బార్ట్‌లెట్ పట్టిన క్యాచ్ కూడా పోటీలో నిలిచింది. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో బౌండరీ లైన్‌ను దాటుతున్న బంతిని పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాలిలోనే పట్టుకుని.. దాన్ని లోపలికి విసిరాడు. వెంటనే బార్ట్‌లెట్ క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్‌ను అక్కడే డగౌట్‌లో చూసిన రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ చూసి షాక్ అయ్యారు.

TV9 Telugu02 Jun, 02:05 am
తోపులుగా వచ్చి తుస్సుమన్న ఐదుగురు.. పద్ధతిగా రిటైర్మెంట్ చేస్తే పరువైనా మిగిలేనుగా

Indian Cricketers Retirement Rumors: ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించే ఐపీఎల్, కేవలం వినోదానికి మాత్రమే వేదిక కాదు. ఆటగాళ్ల భవిష్యత్తును, వారి ఫామ్‌ను అంచనా వేసేందుకు బీసీసీఐ సెలెక్టర్లకు ఇది ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. ఇక్కడ అద్భుతంగా రాణిస్తే జాతీయ జట్టులో స్థానం ఖాయమవుతుంది, అదే తడబడితే కెరీర్‌కే ఎండ్ కార్డ్ పడుతుంది. తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్ కొంతమంది దిగ్గజ భారత ఆటగాళ్లకు తీవ్ర నిరాశను మిగిల్చింది. గాయాలు, పేలవమైన ఫామ్, వయసు భారంతో సతమతమవుతున్న ఐదుగురు స్టార్ క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ ఐదుగురు ఆటగాళ్ల కెరీర్ పరిస్థితి ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. 4. అజింక్య రహానే (రెడ్-బాల్, వైట్-బాల్ క్రికెట్‌లో నిరాశ): సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగింపు దశకు వచ్చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. కోల్‌కతా జట్టు కెప్టెన్‌గా ఉన్న రహానే ఈ సీజన్లో ఓపెనర్‌గా బరిలోకి దిగి ప్రతి మ్యాచ్‌లోనూ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. 14 మ్యాచ్‌లు ఆడిన ఆయన కేవలం 335 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అటు దేశీవాళీ క్రికెట్లోనూ గత 12 నెలలుగా ఎలాంటి అద్భుత ప్రదర్శన చేయలేదు. అంతర్జాతీయ జట్టులో ఇప్పటికే స్థానం కోల్పోయిన రహానే, ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించే యోచనలో ఉన్నట్లు సమాచారం. 3. యుజ్వేంద్ర చహల్ (తగ్గిన పాత పదును): భారత స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌కు కూడా ఈ ఐపీఎల్ సీజన్ ఆశించిన స్థాయిలో సాగలేదు. పంజాబ్ జట్టు తరపున ఆడిన చహల్ 14 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టారు. అయితే పరుగులను అడ్డుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన రికార్డు చహల్ పేరిట ఉన్నప్పటికీ, ఈసారి అతడి బౌలింగ్‌లో మునుపటి మ్యాజిక్ కనిపించలేదు. ప్రస్తుతం భారత జట్టులోకి వరుణ్ చక్రవర్తి లాంటి యువ స్పిన్నర్లు దూసుకురావడంతో, చహల్ మళ్లీ జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడం దాదాపు అసాధ్యంగా మారింది. 2. మహమ్మద్ షమీ (ఫిట్‌నెస్ సమస్యలతో సతమతం): ఒకప్పుడు టీమిండియా నమ్మకమైన వికెట్ టేకర్ అయిన మహమ్మద్ షమీని సెలెక్టర్లు క్రమంగా పక్కన పెడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌లో అతనికి చోటు దక్కకపోవడమే దీనికి ఉదాహరణ. లక్నో జట్టు తరఫున కొత్త బంతితో ఇన్నింగ్స్ అద్భుతంగా ప్రారంభించినా, టోర్నమెంట్ ముగిసేసరికి ఆ ఊపును కొనసాగించలేకపోయాడు. 13 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీసినప్పటికీ, భారీగా పరుగులు సమర్పించుకోవడం జట్టుకు నష్టాన్ని చేకూర్చింది. ప్రస్తుతం 35 ఏళ్ల వయసున్న షమీ, సుదీర్ఘమైన స్పెల్స్ వేయడానికి శరీరం సహకరించకపోవడంతో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 1. రోహిత్ శర్మ (హిట్‌మ్యాన్ ప్రయాణం ముగింపునకు చేరిందా?): భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ ఐపీఎల్ సీజన్ మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. ముంబా ఇన్నింగ్స్ ఆరంభంలో కోల్‌కతాపై 38 బంతుల్లో 78 పరుగులు చేసి మెరిసినా, ఆ తర్వాత తగిలిన గాయం అతడి ఆటను పూర్తిగా దెబ్బతీసింది. గాయం నుంచి కోలుకున్నాక రోహిత్ పాత లయను అందుకోలేకపోయాడు. ఈ సీజన్‌లో కేవలం 9 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన రోహిత్, చివరి దశలో కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రమే మైదానంలోకి రావడం అతడి ఫిట్‌నెస్‌పై ఎన్నో అనుమానాలను రేకెత్తించింది. 9 మ్యాచ్‌ల్లో 283 పరుగులు చేసిన రోహిత్ శర్మ, రాబోయే వన్డే ప్రపంచ కప్ నాటికి శరీరం సహకరించడం కష్టమని భావిస్తే, యువ ఆటగాళ్ల భవిష్యత్తు కోసం అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకునే అవకాశం ఉంది. సమయం ఎవరి కోసమూ ఆగదు, క్రీడా రంగంలో వయసు అనేది అత్యంత కీలకమైన అంశం. ఎన్నో ఏళ్లుగా భారత క్రికెట్‌కు ఎనలేని సేవలు అందించిన ఈ దిగ్గజాలు, యువ రక్తం జట్టులోకి దూసుకువస్తున్న తరుణంలో గౌరవప్రదంగా వీడ్కోలు పలకడమే ఉత్తమమని భావిస్తున్నారు. అభిమానులకు ఇది బాధాకరమైన విషయమే అయినప్పటికీ, భారత క్రికెట్ సుదీర్ఘ భవిష్యత్తు కోసం ఈ మార్పులు అనివార్యం.