translateexpand_more

Swornin News

Latest updates from Telugu Digital news sources.

TeluguOne03 Jun, 04:15 am
కర్ణాటక రాజకీయాల్లో కొత్త అధ్యాయం

కాంగ్రెస్ పార్టీకి అత్యంత నమ్మకమైన, తిరుగులేని ట్రబుల్‌షూటర్ గా పేరొందిన డీకే శివకుమార్ కర్నాటక సీఎంగా బుధవారం (జూన్ 2) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో కర్నాటక రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైందని చెప్పవచ్చు. ఎన్నో ఒడుదొడుకులు, సుదీర్ఘ నిరీక్షణల అనంతరం డీకే కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, పార్టీని సంక్షోభాల నుంచి ఒంటిచేత్తో బయటపడేసిన 64 ఏళ్ల ఈ సీనియర్ నాయకుడి కల ఎట్టకేలకు సాకారమైంది. డీకేకి సీఎం పదవి దక్కడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. కర్ణాటక శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన శివకుమార్, ఈ విజయం కేవలం ఒక పదవి మాత్రమే కాదని, తన దశాబ్దాల కఠిన శ్రమకు, అంకితభావానికి దక్కిన అసలైన ఫలితమని ప్రకటించారు. నెహ్రూ-గాంధీ కుటుంబం తనపై ఉంచిన అపారమైన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, రైతులు, మహిళలు, యువత భాగస్వామ్యంతో రాష్ట్రంలో నవ యుగం' సృష్టిస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి బెంగళూరులోని లోక్‌భవన్‌ గ్లాస్ హౌస్ ముస్తాబైంది. బుధవారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్.. డీకే శివకుమార్‌తో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ వేడుకలో జ్యోతిష్యుల సలహాలు, సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం లోక్‌భవన్ గ్లాస్ హౌస్‌లోని ప్రధాన వేదికను పడమర ముఖం నుంచి తూర్పు ముఖంగా మార్చారు. డీకే శివకుమార్‌తో పాటు తొలి విడత 13 మంది కీలక నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కుల, ప్రాంతీయ సమీకరణాలను సమతూకం చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ ఈ మంత్రివర్గాన్ని కూర్చింది. ఇందులో భాగంగా సీనియర్ దళిత నాయకుడు జి.పరమేశ్వర రాష్ట్ర ఏకైక డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనుండగా, మరో సీనియర్ నేత హెచ్.కె.పాటిల్ అసెంబ్లీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. తొలి విడతలో ప్రమాణం చేయబోయే 13 మంది మంత్రుల జాబితాలో మాజీ సీఎం సిద్ధరామయ్య కుమారుడు యాతీంద్రతో పాటు, కేహెచ్ మునియప్ప, యూటీ ఖాదర్, కేజే జార్జ్, కృష్ణ బైరేగౌడ, ఎంబీ పాటిల్, ప్రియాంక్ ఖర్గే, సతీష్ జార్కిహోళి, రామలింగారెడ్డి, దినేష్ గుండూరావు, బైరతి సురేష్, ఈశ్వర్ ఖండ్రే వంటి బలమైన నేతలకు చోటు దక్కే అవకాశం ఉంది. మరోవైపు, ఇప్పటివరకు రాష్ట్రాన్ని నడిపించి, అధికార మార్పిడి సజావుగా సాగేలా సహకరించిన మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్ హైకమాండ్ జాతీయ స్థాయిలో అత్యున్నత గౌరవాన్ని కల్పించింది. పార్టీలో అత్యున్నత నిర్ణాయక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసీ) సభ్యుడిగా సిద్ధరామయ్యను నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా డీకే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఉన్న ఇండియా కూటమికి చెందిన పలువురు ముఖ్యమంత్రులు, కర్ణాటకలోని వివిధ ప్రముఖ మఠాల అధిపతులు తరలివస్తున్నారు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ సభపై దుమారం: కవిత, పొన్నం వ్యాఖ్యలపై బాలకోటయ్య ఫైర్