
ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్లో లైంగిక వేధింపుల ముఠాల (Grooming Gangs) అరాచకాలపై అక్కడి చట్టసభ మరోసారి చర్చించింది. అనేక రాష్ట్రాల్లో చిన్నారులు, మహిళల లైంగిక దోపిడీకి సంబంధించి స్వతంత్ర దర్యాప్తు నివేదికలోని సంచలన విషయాలను బాహ్య ప్రపంచం ముందుంచింది. వ్యవస్థీకృత ముఠాల వేధింపులు, అత్యాచారాలు, పోలీసులు వ్యవహరించిన తీరు, తదితర అంశాలపై బాధితులు, సాక్ష్యులు ఇచ్చిన వాంగ్మూలాలను కొందరు చట్టసభ సభ్యులు వివరించారు. అయితే, ఈ దారుణాలకు పాల్పడిన వారిలో ఎక్కువశాతం పాకిస్థాన్ (Pakistan) మూలాలున్న ట్యాక్సీ డ్రైవర్లు, వ్యాపారులే ఉన్నట్లు గతంలో తేలిన విషయం తెలిసిందే. బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడు రూపెల్ట్ లోవ్ మాట్లాడుతూ.. ‘‘లైంగిక దాడులకు గురైన వారిలో ఎంతో మంది చిన్నారులు, మహిళలు ఉన్నారు. మైనర్గా ఉన్నప్పుడే తనపై లైంగిక దాడి జరిగిందని ఓ బాధితురాలు చెప్పింది. మూడేళ్లలో ఆమెపై 600-700 మంది అత్యాచారం చేసినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. తన ప్రైవేటు భాగాలను తీవ్రంగా గాయపరిచినట్లు మరో మహిళ పేర్కొంది. బాధితులను జంతువుల్లా చూసినట్లు అనేక మంది చెప్పారు. శ్వేతజాతీయులనే లక్ష్యంగా చేసుకొని ఈ ముఠాలు లైంగిక హింసకు పాల్పడ్డాయని మరికొందరు బాధితులు వాంగ్మూలం ఇచ్చారు. కొందరు పోలీసు అధికారులు వ్యవహరించిన తీరుపైనా అనేక ఆరోపణలు ఉన్నాయి’’ అని వివరించారు. ఇలాంటి దురాగతాలను అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని చట్టసభ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. నేను లేకపోతే జైల్లో ఉండేవాడివి.. నెతన్యాహుపై ట్రంప్ ఫైర్ బ్రిటన్లో లైంగిక వేధింపుల ముఠా అరాచకాల విషయం 2002లో తొలిసారి వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్ మూలాలున్న అనేక మంది.. దేశవ్యాప్తంగా కొన్ని వర్గాల అమ్మాయిలను లక్ష్యంగా చేసుకొని లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. సౌత్ యార్క్షైర్లో 2010లో కొందరు మైనర్ అమ్మాయిలను వేధించిన కేసులో పాక్ మూలాలున్న ఐదుగురు దోషులుగా తేలడం అప్పట్లో సంచలనం రేపింది. అనంతరం రోచ్డేల్, రోథర్హ్యామ్, ఓల్డ్హ్యామ్, టెల్ఫోర్డ్ తదితర ప్రాంతాల్లో జరిపిన దర్యాప్తులో ఈ వ్యవస్థీకృత ముఠాల దుర్మార్గాలు బయటపడ్డాయి. అయితే, చాలా కేసుల్లో పోలీసు అధికారుల పాత్ర కూడా ఉందని, బాధితుల ఫిర్యాదులపై సరైన చర్య తీసుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.