
ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ అభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, పరిశ్రమకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ భరోసా ఇచ్చారు. విజయవాడలో జరిగిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తరపున చిత్ర పరిశ్రమకు ఈ హామీ ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. "ఏపీలో షూటింగ్లతో పాటు స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్ల వంటి మౌలిక సదుపాయాలు నిర్మించేందుకు నిర్మాతలు ముందుకు రావాలి. వారికి సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం" అని ఆయన పిలుపునిచ్చారు. దీనివల్ల స్థానిక ప్రతిభకు కూడా ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా 'పెద్ది' సినిమాపై మంత్రి ప్రశంసలు కురిపించారు. గ్లింప్స్, ట్రైలర్ చూస్తుంటే ఇదొక అద్భుతమైన దృశ్యకావ్యంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. "చెన్నైలో పుట్టి, హైదరాబాద్లో పెరిగినా... రామ్ చరణ్ ఈ రస్టిక్ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు. నటన ఆయన నరనరాన ఉంది. రామ్ చరణ్, జాన్వి కపూర్ల జంట... అలనాటి చిరంజీవి, శ్రీదేవిల జంటను గుర్తు చేస్తోంది" అని అన్నారు. దర్శకుడు బుచ్చిబాబు తూర్పు గోదావరి జిల్లా వాసి కావడం గర్వంగా ఉందని, ఆయన ప్రతిభతో పాటు వినయం గొప్పదని అభినందించారు. ఈ సినిమా భారీ విజయం సాధించి, దీనిపై ఆధారపడిన వందలాది కుటుంబాలకు మేలు కలగాలని మంత్రి మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.