
Compassionate Appointment : కారుణ్య నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్న వివాహితులైన కూతుళ్లకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ప్రభుత్వ ఉద్యోగులు సర్వీసులో ఉండగా మరణిస్తే, వారి స్థానంలో ఇచ్చే కారుణ్య నియామకాలకు పెళ్లి చేసుకున్న కూతుళ్లు కూడా అర్హులేనని తేల్చిచెప్పింది. పెళ్లియిందన్న ఒక్క కారణంతో వారి హక్కులను కాలరాయలేరని కోర్టు స్పష్టం చేసింది. పెళ్లి అనేది ఒక మహిళ అర్హతను లేదా ఆమె తన తల్లిదండ్రులపై ఆధారపడే స్థిని మార్చలేదని అభిప్రాయపడింది. Also Read : India Gold Imports : దేశంలో ప్రజల వద్ద 32వేల టన్నుల బంగారం నిల్వలు.. అందులో కేవలం 1శాతం రీసైక్లింగ్ చేస్తేచాలు.. ఆ తరువాత ఏం జరుగుతుంది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంకు చెందిన వివాహిత మహిళ దాఖలు చేసిన పిటిషన్ నుంచి ఈ కేసు మొదలైంది. తన తల్లి మరణం తరువాత రేషన్ షాపు లైసెన్సు కోసం దరఖాస్తు చేసిన ఆమెకు వివాహిత కూతురు అనే కారణంతో లైసెన్సును ప్రభుత్వం నిరాకరించింది. ఆమె తన వికలాంగ సోదరిని చూసుకుంటూ, కుటుంబంతోనే నివసిస్తూ తల్లికి సహాయం చేస్తూ షాపు నడిపేది. దీంతో ప్రభుత్వం ఉత్తర్వులను సవాల్ చేస్తూ రేషన్ షాపు డీలర్ కుమార్తె హైకోర్టులో సవాల్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్ధించింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. సుప్రీంకోర్టు ఆమెకు ఊరట కలిగిస్తూ కీలక తీర్పును వెలువరించింది. వివాహమైనంత మాత్రాన కుమార్తెతో కుటుంబ బంధం ముగిసిపోదని, కొనసాగుతూనే ఉంటుందని ధర్మాసనం తెలిపింది. వివాహమైన కుమారుడు విడిగా దూరంగా ఉంటున్నప్పటికీ కుటుంబ సభ్యుడిగా పరిగణిస్తూ.. కుమార్తె విషయంలో భిన్నంగా ఆలోచించడం లింగ వివక్షేనని ధర్మాసనం అభిప్రాయ పడింది. కుటుంబ నిర్వచనం పరిధి నుంచి వివాహిత కుమార్తెను మినహాయించడం ఏకపక్షం, అన్యాయం, రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. కారుణ్య నియామకాలకు వివాహిత కుమార్తెలు కూడా అర్హులేనంటూ జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ ఆలోక్ ఆరాధే ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది.
