translateexpand_more

Chalo Delhi News

Latest updates from Telugu Digital news sources.

AP7AM01 Jun, 12:54 pm
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం అసాధ్యం

సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు బీజేపీపై ధ్వజమెత్తారు. ఆ పార్టీ మతపరమైన విభజన, మతం అనే సౌధంపై నిలబడి ఉందని తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ దండయాత్ర, జైత్రయాత్ర చేయబోతోందంటూ ఆ పార్టీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని, అయితే ఇక్కడ వారు కొన్ని సీట్లు గెలవొచ్చేమో కానీ అధికారంలోకి రావడం మాత్రం అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, అందువల్ల సీపీఐ శ్రేణులు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల వ్యూహాన్ని ప్రకటిస్తూ, పొత్తులు ఉంటే కనీసం 5 స్థానాల్లో, లేనిపక్షంలో కనీసం 15 నియోజకవర్గాల్లో పోటీ చేసేలా పార్టీ సన్నద్ధం కావాలని కూనంనేని పేర్కొన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో బలమైన 40 నియోజకవర్గాలను గుర్తించామని, అక్కడ ఆగస్టు 6 నుంచి 15 వరకు ప్రత్యేక పాదయాత్రలు చేపడతామని వెల్లడించారు. ఈ యాత్రల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలతో పాటు స్థానిక సమస్యలను ప్రజల ముందుకు తీసుకెళ్తామన్నారు. అలాగే ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై జరుగుతున్న వేధింపులకు వ్యతిరేకంగా జూన్ 4న, ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై జూన్ 15న ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని, సెప్టెంబర్ 28న ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.