
తెలంగాణలో జనసేన పార్టీ కార్యకలాపాలు కొనసాగుతాయని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు తెలంగాణలో పార్టీ విస్తరణపై తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పినా, పార్టీ కార్యకర్తలు, మద్ధతుదారుల అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో ఎన్నికల బరిలోకి దిగే అవకాశాన్ని సూచించారు. ప్రజలు కోరుకుంటే తెలంగాణలో కూడా పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమైతే జనసేన ఆ బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై సహజసిద్ధమైన వ్యతిరేకత లేదని పవన్ అన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు దశాబ్దాలుగా కలిసి జీవిస్తున్నారని, ఉద్యోగాలు, వ్యాపారాలు, సినీ రంగం వంటి అనేక రంగాల్లో పరస్పర సహకారం కొనసాగుతోందని చెప్పారు. కొంతమంది రాజకీయ నాయకులు లేదా వ్యక్తులు ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను విడదీసే రాజకీయాల కంటే అభివృద్ధి, ఉపాధి, సంక్షేమ అంశాలపై చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఏమైనా ఇక్కడి రాజకీయ నాయకుల జాగీరా అంటూ ప్రశ్నించారు. తనను తెలంగాణకు రావొద్దని కొందరు హెచ్చరిస్తున్నారని, కానీ అలాంటి వ్యాఖ్యలకు తాను వెనక్కి తగ్గబోనని పవన్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఏ రాష్ట్రానికైనా వెళ్లే హక్కు ప్రతి భారతీయుడికి ఉందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా ఎదుర్కొన్న ఒత్తిళ్లు, బెదిరింపులతో పోలిస్తే ఇవి పెద్ద విషయాలు కాదని వ్యాఖ్యానించారు. భయపెట్టి రాజకీయంగా అణచివేయాలనే ప్రయత్నాలు ఫలించవని చెప్పారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి మీడియా సమావేశం Live Link: https://t.co/Y6j4NhJdgl #PawanKalyanTelanganaPressMeet#TelanganaFormationDay#JanaSenaTelangana#JaiTelangana తెలంగాణతో తనకు భావోద్వేగ అనుబంధం ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమం, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తానని చెప్పారు. గతంలో కూడా తెలంగాణ ప్రాంతంలోని పలు సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తనవంతు సహాయం అందించానని గుర్తు చేశారు. ప్రజల సమస్యలు ఎక్కడ ఉన్నా వాటిపై స్పందించడం తన బాధ్యతగా భావిస్తానని అన్నారు. తెలంగాణలో జరిగే అన్యాయాలపై కూడా అవసరమైతే గళమెత్తుతానని స్పష్టం చేశారు. రాష్ట్ర ఏర్పాటై దశాబ్దానికి పైగా గడిచిన తరువాత కూడా కొన్ని సమస్యలకు ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలను కారణంగా చూపడం సరైన విధానం కాదని పవన్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఉపాధి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాంతీయ విభేదాల కంటే ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల ముఖ్యమని చెప్పారు. రాజకీయ పార్టీలు ప్రజల మధ్య విభజనలు సృష్టించే బదులు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. పవన్ కల్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీశాయి. తెలంగాణలో జనసేన భవిష్యత్తు పాత్ర, పార్టీ విస్తరణ అవకాశాలు, ప్రాంతీయ రాజకీయాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రానున్న రోజుల్లో జనసేన తెలంగాణలో ఎలాంటి కార్యాచరణ చేపడుతుందనేది ఆసక్తికరంగా మారింది.



