translateexpand_more

Jana Sena Telangana News

Latest updates from Telugu Digital news sources.

Asianet News Telugu02 Jun, 02:32 pm
తెలంగాణ మీ జాగిరా.? పూర్తిగా ఓపెన్ అయిన ప వ న్ క ళ్యాణ్

తెలంగాణలో జనసేన పార్టీ కార్యకలాపాలు కొనసాగుతాయని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు తెలంగాణలో పార్టీ విస్తరణపై తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పినా, పార్టీ కార్యకర్తలు, మద్ధతుదారుల అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో ఎన్నికల బరిలోకి దిగే అవకాశాన్ని సూచించారు. ప్రజలు కోరుకుంటే తెలంగాణలో కూడా పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమైతే జనసేన ఆ బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై సహజసిద్ధమైన వ్యతిరేకత లేదని పవన్ అన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు దశాబ్దాలుగా కలిసి జీవిస్తున్నారని, ఉద్యోగాలు, వ్యాపారాలు, సినీ రంగం వంటి అనేక రంగాల్లో పరస్పర సహకారం కొనసాగుతోందని చెప్పారు. కొంతమంది రాజకీయ నాయకులు లేదా వ్యక్తులు ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను విడదీసే రాజకీయాల కంటే అభివృద్ధి, ఉపాధి, సంక్షేమ అంశాలపై చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఏమైనా ఇక్క‌డి రాజ‌కీయ నాయ‌కుల జాగీరా అంటూ ప్ర‌శ్నించారు. తనను తెలంగాణకు రావొద్దని కొందరు హెచ్చరిస్తున్నారని, కానీ అలాంటి వ్యాఖ్యలకు తాను వెనక్కి తగ్గబోనని పవన్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఏ రాష్ట్రానికైనా వెళ్లే హక్కు ప్రతి భారతీయుడికి ఉందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా ఎదుర్కొన్న ఒత్తిళ్లు, బెదిరింపులతో పోలిస్తే ఇవి పెద్ద విషయాలు కాదని వ్యాఖ్యానించారు. భయపెట్టి రాజకీయంగా అణచివేయాలనే ప్రయత్నాలు ఫలించవని చెప్పారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి మీడియా సమావేశం Live Link: https://t.co/Y6j4NhJdgl #PawanKalyanTelanganaPressMeet#TelanganaFormationDay#JanaSenaTelangana#JaiTelangana తెలంగాణతో తనకు భావోద్వేగ అనుబంధం ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమం, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తానని చెప్పారు. గతంలో కూడా తెలంగాణ ప్రాంతంలోని పలు సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తనవంతు సహాయం అందించానని గుర్తు చేశారు. ప్రజల సమస్యలు ఎక్కడ ఉన్నా వాటిపై స్పందించడం తన బాధ్యతగా భావిస్తానని అన్నారు. తెలంగాణలో జరిగే అన్యాయాలపై కూడా అవసరమైతే గళమెత్తుతానని స్పష్టం చేశారు. రాష్ట్ర ఏర్పాటై దశాబ్దానికి పైగా గడిచిన తరువాత కూడా కొన్ని సమస్యలకు ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలను కారణంగా చూపడం సరైన విధానం కాదని పవన్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఉపాధి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాంతీయ విభేదాల కంటే ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల ముఖ్యమని చెప్పారు. రాజకీయ పార్టీలు ప్రజల మధ్య విభజనలు సృష్టించే బదులు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. పవన్ కల్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీశాయి. తెలంగాణలో జనసేన భవిష్యత్తు పాత్ర, పార్టీ విస్తరణ అవకాశాలు, ప్రాంతీయ రాజకీయాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రానున్న రోజుల్లో జనసేన తెలంగాణలో ఎలాంటి కార్యాచరణ చేపడుతుందనేది ఆసక్తికరంగా మారింది.

NTV Telugu02 Jun, 11:47 am
బెదిరింపులకు భయపడేది లేదు.. నేనే తెలంగాణ అంతటా తిరుగుతా.. పోటీ చేస్తాం

Pawan Kalyan: తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారకర్తగా తిరుగుతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల సమస్యలు, యువత ఉపాధి అవకాశాలపై మాట్లాడటం తన బాధ్యత అని పేర్కొన్నారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమని, ఇక్కడి ప్రజల సమస్యలపై మాట్లాడే హక్కు ప్రతి భారతీయుడికి ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే భయపడే ప్రసక్తే లేదని, భయపెట్టే కొద్దీ తన సంకల్పం మరింత బలపడుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పలువురు వ్యక్తులు నేడు ఉన్నత పదవుల్లో ఉన్నారని ఆయన గుర్తు చేశారు. యువరాజ్యం రోజుల నుంచి తెలంగాణ యువత తనకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందిస్తూ, గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని, ప్రజల మద్దతుతో వాటిని ఎదుర్కొన్నామని అన్నారు. వేర్పాటువాదం దేశ సమగ్రతకు భంగం కలిగించనంత వరకు ప్రజాస్వామ్య వ్యవస్థలో చర్చనీయాంశమేనని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. దేశంలో ఎక్కడైనా తిరిగే హక్కు ప్రతి పౌరుడికీ ఉందని, కాంగ్రెస్ నాయకులు ఇతర రాష్ట్రాల్లో రాజకీయాలు చేయవచ్చని, కానీ తాము తెలంగాణలో పర్యటిస్తే అభ్యంతరాలు వ్యక్తం చేయడం సరైన విధానం కాదని విమర్శించారు. ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేయవచ్చని, గతంలో ఇందిరా గాంధీ మెదక్ నుంచి పోటీ చేశారని గుర్తు చేసిన పవన్ కల్యాణ్, అదే విధంగా దేశవ్యాప్తంగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడం ప్రజాస్వామ్య హక్కు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ అంశాలపై స్పందించాలని కోరారు. ఇక, పాశం యాదగిరిపై తనకు గౌరవం ఉందని, అయితే ఆయన కూడా తనపై విమర్శలు చేయడం బాధ కలిగించిందని పవన్ కల్యాణ్ అన్నారు. తాము దేశ పౌరులమని, పన్నులు చెల్లిస్తున్నామని, తెలంగాణలో ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ఎలాంటి పాస్‌పోర్ట్ అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఉపాధి అవకాశాలు, యువత భవిష్యత్తు, ప్రజా సమస్యలపై చర్చిస్తుంటే వ్యక్తిగత విమర్శలు చేయడం బాధాకరమని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని, భవిష్యత్తులో కూడా తెలంగాణ ప్రజల కోసం గళం వినిపిస్తానని స్పష్టం చేశారు.

Andhra Jyothy02 Jun, 11:39 am
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది

తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందని ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. తెలంగాణలో పోటీ చేస్తామని ఆయన కుండ బద్దలు కొట్టారు. హైదరాబాద్,జూన్02: తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందని ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. తెలంగాణలో పోటీ చేస్తామని ఆయన కుండ బద్దలు కొట్టారు. మంగళవారం జూబ్లీహిల్స్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. దేశంలో అంతర్భాగం తెలంగాణ అని స్పష్టం చేశారు. తెలంగాణను వ్యతిరేకించిన వారే.. పదవుల్లో ఉన్నారని.. ఎమ్మెల్యేలు అయ్యారని పవన్‌ కల్యాణ్ వివరించారు. తెలంగాణ అంటే గౌరవం ఉంది కనుకే కొండగట్టు ఆలయానికి కోట్ల రూపాయిలు విరాళంగా ఇచ్చామన్నారు పవన్ కల్యాణ్. మీ తాటాకు చప్పుళ్లకు జనసేన పార్టీ భయపడదన్నారు. భయపడేవాడినే అయితే పార్టీ పెడతానా? అని ప్రశ్నించారు. తెలంగాణకు ద్రోహం జరిగితే మొట్టమొదట గొంతులేపేది జనసేన పార్టీనే అని స్పష్టం చేశారు. ఏం చేసినా ఓట్ల కోసం కాదు.. తనకు తెలంగాణపై ప్రేమ, మమకారం ఉన్నాయన్నారు. గుంటూరులో టీఆర్ఎస్ కార్యాలయం పెడితే స్వాగతించామని ఏపీ డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. ఇక్కడ ఏమైనా చేస్తే తాను సీఎం అయిపోతానా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. తెలంగాణను తానెప్పుడు అవమానించాను? అని ఆయన స్థానిక నేతలను ప్రశ్నించారు. తన పీక కోసినా కూడా భయపడేది లేదన్నారు. తనకు రెచ్చగొట్టడం ఇష్టం లేదని తెలిపారు. తనను ఎన్ని తిట్టినా పట్టించుకోనన్నారు. తెలంగాణలో ఉపాధి లేకపోతే తాను కారణమా? అని రాజకీయ పార్టీల నాయకులను ఆయన సూటిగా నిలదీశారు. మద్రాస్‌లో ఉన్న చిత్రపరిశ్రమ ఇక్కడికి ఎలా వచ్చిందన్నారు. ఆంధ్రా వాళ్లను తిడుతుంటే వాళ్లు ఇక్కడెలా ఉంటారన్నారు. ఇంకెంతకాలం ఆంధ్రావాళ్లను తిడుతూ కాలక్షేపం చేస్తారంటూ తెలంగాణలోని నాయకులకు ఆయన సూటిగా ప్రశ్నించారు. సడెన్‌గా ఇక్కడికి రావొద్దంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో ఏపీ కాంట్రాక్టర్లు బాగానే ఉన్నారన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తనకు గౌరవం ఉందన్నారు. తాను చెరువును కబ్జా చేశానని కొందరు అంటున్నారని.. అలా చేస్తే తనను ఇక్కడ ఉండనిస్తారా? అని ఆయన సూటిగా నిలదీశారు. తన ఫామ్‌హౌస్‌ కబ్జా అని తేలిస్తే.. దానిని రాష్ట్ర ప్రభుత్వానికే రాసిస్తానన్నారు. గద్దర్‌తో తనకు చాలా సాన్నిహిత్యం ఉందని గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లోకి రాకముందే తనకు గద్దర్‌ తెలుసునన్నారు. గద్దర్‌ ఒంట్లో బుల్లెట్లు దిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదని రాజకీయ పార్టీల నేతలను పవన్ కల్యాణ్ సూటిగా ప్రశ్నించారు. గద్దర్‌ తమ పార్టీ కార్యాలయానికి వచ్చేవారని గుర్తు చేశారు. గద్దర్‌ బతికున్నప్పుడు మీరంతా ఎక్కడున్నారు? అంటూ తనను ప్రశ్నిస్తున్న నేతలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చురకలంటించారు. తెలంగాణ పోరాట స్ఫూర్తితో ఉత్తేజం పొందాం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్