translateexpand_more

Ponnam News

Latest updates from Telugu Digital news sources.

Telugu Times03 Jun, 06:01 am
పవన్ ను కెలికితే ఇలాగే ఉంటుందా

రాజకీయ క్షేత్రంలో ఒక్కోసారి ప్రత్యర్థులు చేసే తీవ్ర విమర్శలే నాయకులకు ఊహించని మైలేజీని తెచ్చిపెడుతుంటాయి. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు దీనికి అద్దం పడుతున్నాయి. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ వేదికగా గచ్చిబౌలిలో జనసేన పార్టీ నిర్వహించాలనుకున్న ‘తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ’ చుట్టూ నడిచిన హైడ్రామా… ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఒక్కసారిగా ఇక్కడి రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మార్చేసింది. నిన్నటివరకు తెలంగాణలో కనీస ఓటు బ్యాంక్ సాధించలేకపోయిన జనసేనాని చుట్టూనే ఇప్పుడు ఇక్కడి ప్రధాన శక్తులన్నీ తిరుగుతున్నాయి. గత ఎన్నికల సమయంలో బీజేపీతో జతకట్టి బరిలోకి దిగిన జనసేనకు తెలంగాణలో కోలుకోలేని దెబ్బ తగిలింది. కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేక ఆ పార్టీ చతికిలపడింది. అయితే, నాటి పవన్ కల్యాణ్‌తో పోలిస్తే నేటి పవన్ కల్యాణ్ పొలిటికల్ వెయిట్ పూర్తిగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమిని అఖండ విజయం వైపు నడిపించడంలో చాణక్యం ప్రదర్శించిన ఆయన, ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా అత్యంత పవర్‌ఫుల్ పొజిషన్‌లో ఉన్నారు. పొరుగు రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్న నాయకుడు పక్క రాష్ట్రంలో అడుగుపెట్టి సభ నిర్వహిస్తుంటే ఉండే పొలిటికల్ వైబ్రేషన్స్ వేరుగా ఉంటాయి. అందుకే తెలంగాణలోని ప్రధాన పార్టీలు సైతం ఇప్పుడు ఆయన్ను ఏమాత్రం తేలికగా తీసుకోలేకపోతున్నాయి. పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ‘తెలంగాణ రక్షణ సేన’ అధినేత్రి కల్వకుంట్ల కవిత చేసిన ‘పళ్లు రాలగొడతాం’, ‘విగ్రహాలు పార్సిల్ చేస్తాం’ లాంటి ఘాటు వ్యాఖ్యల వెనుక పక్కా పొలిటికల్ అజెండా కనిపిస్తోంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వరుస పరాజయాలతో డీలా పడిన బీఆర్ఎస్, ప్రస్తుతం తెలంగాణ సెంటిమెంట్‌పై పట్టు కోల్పోయింది. ఈ తరుణంలో పవన్‌ను ఆంధ్రా నేతగా చిత్రీకరిస్తూ ఆయనపై విమర్శలు గుప్పించడం ద్వారా, తిరిగి ప్రాంతీయ సెంటిమెంట్‌ను రగిల్చి తమ పాత ఓటు బ్యాంకును, సానుభూతిని కూడగట్టాలని కవిత వ్యూహం రచించారు. మరోవైపు, కేవలం బీఆర్ఎస్ మాత్రమే కాకుండా అధికార కాంగ్రెస్ సైతం ఈ రేసులోకి దూకింది. మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం జనసేనానిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో కన్నీరు పెట్టిన వ్యక్తికి ఇక్కడ నవనిర్మాణం గురించి మాట్లాడే అర్హత లేదని, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, ‘తెలంగాణ మా అయ్య జాగీరే’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ ఆత్మగౌరవాన్ని కాపాడటంలో తామేమీ వెనుకబడలేదని నిరూపించుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నించింది. ఈ విధంగా ఉమ్మడిగా ఇరు పార్టీలు పవన్‌ను టార్గెట్ చేయడం వల్ల ఆయన పొలిటికల్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. గచ్చిబౌలి సభకు సైబరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించడం జనసేన పార్టీకి రాజకీయంగా పెద్ద వరంగా మారింది. శాంతిభద్రతలు, ట్రాఫిక్ సమస్యల సాకుతో సభను అడ్డుకోవడం వల్ల, పవన్ కల్యాణ్ పొలిటికల్ స్క్రీన్‌పై ఒక బాధిత నేతగా ఫోకస్ అయ్యారు. దీనికి కౌంటర్‌గా మంగళవారం సాయంత్రం పవన్ కల్యాణ్ తన నివాసంలో నిర్వహించిన ప్రెస్ మీట్, అందులో ఆయన సంధించిన విమర్శలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ఒకవేళ గచ్చిబౌలి సభ సజావుగా సాగి ఉంటే ఆయన కేవలం తన పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసి వెళ్ళిపోయేవారు. కానీ ఈ నిషేధాజ్ఞల వల్ల ఆయన తెలంగాణలో ఒక బలమైన శక్తిగా ప్రొజెక్ట్ అయ్యే అవకాశం దక్కింది. మొత్తంమీద, పవన్ కల్యాణ్‌ను పొలిటికల్ గా కట్టడి చేయాలనే ఉత్సాహంతో తెలంగాణ నేతలు వేసిన అడుగులు వ్యూహాత్మక తప్పిదంగా మారాయి. రాజకీయాల్లో విమర్శల పదును పెరిగే కొద్దీ సదరు నాయకుడి వైపు ప్రజల అటెన్షన్ అంతకంతకూ పెరుగుతుంది. తెలంగాణలోని లక్షలాది మంది జనసేన అభిమానులు, సెటిలర్లు, తటస్థ ఓటర్లు ఈ వివాదంతో పవన్ కల్యాణ్ వైపు మరింత ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. పవన్‌ను బలహీనపరచాలని చూసిన ప్రత్యర్థుల ప్లాన్ రివర్స్ అయి, ఇక్కడి నేతల విమర్శలు, పోలీసుల ఆంక్షలే జనసేనను తెలంగాణ రాజకీయ క్షేత్రంలో ఒక బలమైన శక్తిగా నిలబెట్టడానికి పునాది వేశాయి.