translateexpand_more

Telangana Development News

Latest updates from Telugu Digital news sources.

NTV Telugu02 Jun, 12:01 pm
తెలంగాణ మీ అయ్య జాగీరా..? పవన్ ఫైర్

Pawan Kalyan: తెలంగాణ మీ అయ్య జాగీరా..? అంటూ ఫైర్‌ అయ్యారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌... హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో లక్షలాది మంది జనసేన కార్యకర్తలు ఉన్నారని, రాష్ట్ర ప్రజల సమస్యలపై మాట్లాడే హక్కు తమ పార్టీకి ఉందని ఆయన అన్నారు. జనసేన పార్టీని హైదరాబాద్ నడిబొడ్డునే స్థాపించామని గుర్తు చేసిన పవన్ కల్యాణ్, తెలంగాణపై తమకు కొత్తగా ప్రేమ పుట్టలేదని చెప్పారు. తెలంగాణ గురించి జనసేన ఎందుకు మాట్లాడుతోందని కొందరు ప్రశ్నిస్తున్నారని, అయితే రాష్ట్ర ప్రజల సమస్యలపై స్పందించడం రాజకీయ పార్టీగా తమ బాధ్యత అని పేర్కొన్నారు. తాను తెలంగాణలోని నాలుగు మూలలూ తిరిగానని, రాష్ట్ర అభివృద్ధిని ఎప్పుడూ కోరుకునే వ్యక్తినని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆదిలాబాద్ వంటి నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా పర్యటించానని, ప్రస్తుతం విమర్శలు చేస్తున్న చాలామంది అప్పట్లో అక్కడికి వెళ్లలేదని వ్యాఖ్యానించారు. తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని, రాష్ట్ర విభజన జరిగిన విధానంపైనే తన అభ్యంతరం అని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు, నాయకులకు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఎలాంటి విద్వేషం లేదని పవన్ కల్యాణ్ అన్నారు. అయితే హైదరాబాద్‌లో ఎలా అడుగుపెడతారని కొందరు ప్రశ్నించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తెలంగాణ ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదని, ఎవరూ తనను బెదిరించలేరని వ్యాఖ్యానించారు. తన ఇంటి చిరునామా చెప్పడానికే ప్రెస్‌మీట్ పెట్టానని, బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. గత 12 ఏళ్లలో కేసీఆర్ లేదా తెలంగాణ నాయకులపై తాను వ్యక్తిగత విమర్శలు చేయలేదని పవన్ కల్యాణ్ తెలిపారు. తనను గతంలో వైఎస్సార్‌సీపీ నాయకులు బెదిరించారని, కానీ తెలంగాణ ప్రజల నుంచి అలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదని చెప్పారు. తెలంగాణలో ఉపాధి అవకాశాల కొరత లేదా ప్రజా సమస్యలపై మాట్లాడితే తనను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఎవరైనా అన్యాయాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అందులో తాను ఉన్నా మినహాయింపు అవసరం లేదని పేర్కొన్నారు. తనపై భూకబ్జా ఆరోపణలు వస్తే వెంటనే విచారణ జరపాలని పవన్ కల్యాణ్ సవాల్ విసిరారు. తాను చెరువు లేదా ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఉంటే ఆస్తులను సీజ్ చేయాలని, చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజాగాయకుడు గద్దర్ గురించి ప్రస్తావించిన పవన్ కల్యాణ్, ఆయన జీవించి ఉన్న సమయంలో చాలా మంది పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న సమయంలో గద్దర్ తనను సహాయం కోరగా, తాను వెంటనే వాహనం కొనిచ్చానని గుర్తు చేశారు. తెలంగాణలో జనసేన పార్టీ తప్పకుండా ఉంటుందని, భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అవసరమైతే తానే తెలంగాణ అంతటా పర్యటిస్తానని, ప్రజా సమస్యలపై ఇదే విధంగా మాట్లాడుతూనే ఉంటానని తెలిపారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమని, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

NTV Telugu02 Jun, 11:47 am
బెదిరింపులకు భయపడేది లేదు.. నేనే తెలంగాణ అంతటా తిరుగుతా.. పోటీ చేస్తాం

Pawan Kalyan: తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారకర్తగా తిరుగుతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల సమస్యలు, యువత ఉపాధి అవకాశాలపై మాట్లాడటం తన బాధ్యత అని పేర్కొన్నారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమని, ఇక్కడి ప్రజల సమస్యలపై మాట్లాడే హక్కు ప్రతి భారతీయుడికి ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే భయపడే ప్రసక్తే లేదని, భయపెట్టే కొద్దీ తన సంకల్పం మరింత బలపడుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పలువురు వ్యక్తులు నేడు ఉన్నత పదవుల్లో ఉన్నారని ఆయన గుర్తు చేశారు. యువరాజ్యం రోజుల నుంచి తెలంగాణ యువత తనకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందిస్తూ, గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని, ప్రజల మద్దతుతో వాటిని ఎదుర్కొన్నామని అన్నారు. వేర్పాటువాదం దేశ సమగ్రతకు భంగం కలిగించనంత వరకు ప్రజాస్వామ్య వ్యవస్థలో చర్చనీయాంశమేనని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. దేశంలో ఎక్కడైనా తిరిగే హక్కు ప్రతి పౌరుడికీ ఉందని, కాంగ్రెస్ నాయకులు ఇతర రాష్ట్రాల్లో రాజకీయాలు చేయవచ్చని, కానీ తాము తెలంగాణలో పర్యటిస్తే అభ్యంతరాలు వ్యక్తం చేయడం సరైన విధానం కాదని విమర్శించారు. ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేయవచ్చని, గతంలో ఇందిరా గాంధీ మెదక్ నుంచి పోటీ చేశారని గుర్తు చేసిన పవన్ కల్యాణ్, అదే విధంగా దేశవ్యాప్తంగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడం ప్రజాస్వామ్య హక్కు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ అంశాలపై స్పందించాలని కోరారు. ఇక, పాశం యాదగిరిపై తనకు గౌరవం ఉందని, అయితే ఆయన కూడా తనపై విమర్శలు చేయడం బాధ కలిగించిందని పవన్ కల్యాణ్ అన్నారు. తాము దేశ పౌరులమని, పన్నులు చెల్లిస్తున్నామని, తెలంగాణలో ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ఎలాంటి పాస్‌పోర్ట్ అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఉపాధి అవకాశాలు, యువత భవిష్యత్తు, ప్రజా సమస్యలపై చర్చిస్తుంటే వ్యక్తిగత విమర్శలు చేయడం బాధాకరమని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని, భవిష్యత్తులో కూడా తెలంగాణ ప్రజల కోసం గళం వినిపిస్తానని స్పష్టం చేశారు.

Andhra Jyothy02 Jun, 09:28 am
రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికపై సీఎస్ రామకృష్ణారావు సమీక్ష

99 రోజుల ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ రామకృష్ణారావు సమీక్ష నిర్వహించారు. జూన్ 4, 6, 8, 10 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు, వార్డు సభలు నిర్వహించాలని కలెక్టర్లకు సూచించారు. హైదరాబాద్, జూన్ 2: 99 రోజుల ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ రామకృష్ణారావు ఈరోజు(మంగళవారం) సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి డీజీపీ సీవీ ఆనంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. జూన్ 4, 6, 8, 10 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు, వార్డు సభలు నిర్వహించాలని కలెక్టర్లకు సూచించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. గ్రామసభల్లో పంటల వైవిధ్యీకరణపై రైతులకు సూచనలు చేయాలన్నారు. వర్షాకాల సన్నద్ధతపై ప్రజలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. నీటి నిల్వల నివారణ, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్ తెలిపారు. మొక్కలు నాటడం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచాలని చెప్పారు. ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలను ప్రజలకు వివరించాలని తెలిపారు. ప్రజాప్రతినిధులు, ఎస్‌హెచ్‌జీ(SHG) సభ్యుల భాగస్వామ్యంతో గ్రామసభలు నిర్వహించాలని కలెక్టర్లకు సీఎస్ రామకృష్ణారావు సూచనలు చేశారు. అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా ప్రజాపాలన: మహేశ్‌ గౌడ్ 2028 డిసెంబర్‌లో మళ్లీ సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం: కేటీఆర్

Andhra Jyothy02 Jun, 06:59 am
డిసెంబర్ లో మళ్లీ సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్ కార్యాలయంలో అమరవీరులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల పాలైందని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్ కార్యాలయంలో అమరవీరులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. ఆపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల పాలైందని వ్యాఖ్యానించారు. లివింగ్ లెజెండ్ కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ వచ్చాక నోరుందని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 'ఎత్తిన జెండా దించనని.. జెండా దించితే రాళ్లతో కొట్టిచంపమని అన్న ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్' అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. 2028 డిసెంబర్‌లో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. నెత్తురు పారిన చోట సాగు నీళ్లు తీసుకువచ్చింది కేసీఆర్ అని తెలిపారు. లక్షా 65 వేల ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ అని.. అల్పకులు ఏది పడితే అది మాట్లాడతారని మండిపడ్డారు. దేశమంతా కాంగ్రెస్‌ను వదిలించుకుందన్నారు. తెలంగాణను కాంగ్రెస్.. కుక్కలు చింపిన విస్తరిలా చేస్తోందని వ్యాఖ్యానించారు. రైతులు.. అధికారుల కాళ్లు పట్టుకునే దుస్థితి వచ్చిందన్నారు. కృష్ణా, గోదావరిని గురువుకు గురుదక్షిణగా రేవంత్ ఇస్తున్నారని ఆరోపించారు. ‘రాహుల్ గాంధీ.. అశోక్‌నగర్ వచ్చి చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? సెక్యూరిటీ లేకుండా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు బయటికి వస్తారా.? రైతుబంధు లేదు.. కానీ రాహుల్ గాంధీ బంధు టింగ్ టింగ్ అని వెళ్తోంది. తెలంగాణ తల్లి ఒడ్డాణం, కిరీటం ఎత్తుకుపోతున్నారు’ అంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లో నేడు పవన్ కల్యాణ్ ప్రెస్‌‌మీట్.. ఆసక్తికర పోస్ట్ అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా ప్రజాపాలన: మహేశ్‌ గౌడ్

Andhra Jyothy02 Jun, 05:04 am
తెలంగాణ ప్రజలకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అమరావతి, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రాంతాలుగా రెండు రాష్ట్రాలు ఏర్పడినా.. తెలుగు జాతి అంతా ఎప్పటికీ ఒక్కటే అని సీఎం అన్నారు. మూడున్నర కోట్ల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలతో యువత బలిదానాలతో సిద్ధించిన రాష్ట్రం తెలంగాణ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోవాలి: చంద్రబాబు ‘తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు ఏర్పడి నేటికి 12 ఏళ్లు. ప్రాంతాలుగా రెండు రాష్ట్రాలుగా ఏర్పడినా... తెలుగు జాతి అంతా ఎప్పటికీ ఒక్కటే. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పోటీ పడి దూసుకుపోవాలి. ఎంతో చరిత్ర, సాంస్కృతిక నేపథ్యం ఉన్న తెలుగు గడ్డ భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలి. తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఏపీ రాజధాని అమరావతి ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలుగా వెలగాలి. ప్రతి తెలుగు కుటుంబానికి అభివృద్ధి ఫలాలు దక్కాలి. అత్యుత్తమ జీవన ప్రమాణాలు పొందాలి. వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో మన రెండు రాష్ట్రాలు కలిసి పని చేసి, కీలక భూమి పోషించి తెలుగు వైభవాన్ని, ప్రాభవాన్ని చాటాలి’ అంటూ సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు. తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు: పవన్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మూడున్నర కోట్ల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలతో యువత బలిదానాలతో సిద్ధించిన రాష్ట్రం తెలంగాణ. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించి పుష్కర కాలం పూర్తయిన సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. జనసేన ఊపిరులూదుకొన్నది తెలంగాణ గడ్డపైనే. ఈ నేల నుంచే వారసత్వంగా పోరాట పటిమను పుణికి పుచ్చుకున్నది. అణగారినవర్గాల సంక్షేమం, యువత ఆకాంక్షలు, వ్యక్తి స్వేచ్ఛకు విఘాతం కలిగితే గళం వినిపించే తెగువ తెలంగాణలో ఉంది. అటువంటి లక్షణం జనసేన శ్రేణుల్లోనూ నిండుగా ఉంది. ఘనమైన చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపద విలసిల్లే తెలంగాణ రాష్ట్రం సమున్నతంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను. తెలంగాణ కోసం బలిదానం చేసిన ప్రతి ఒక్కరికీ అంజలి ఘటిస్తున్నాను’ అంటూ పవన్ కల్యాణ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఏలూరు జిల్లాలో అగ్నిప్రమాదం.. ఇద్దరి మృతి

Andhra Jyothy02 Jun, 03:14 am
అంబేడ్కర్ రాజ్యాంగం వల్లే తెలంగాణ ఆవిర్భావం

అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ నంబర్ 3 ద్వారా తెలంగాణ ఏర్పాటైందని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రాజకీయ పార్టీలకు అతీతంగా కృషి చేయాలని ఆకాంక్షించారు. త్వరలోనే తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారిని గౌరవిస్తామని మాటిచ్చారు. సిద్దిపేట జిల్లా, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Telangana Minister Ponnam Prabhakar) హాజరయ్యారు. ఈ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రగతి నివేదికను చదివి మంత్రి వినిపించారు. అలాగే, హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను మంత్రి ఎగురవేశారు. హుస్నాబాద్ అంబేడ్కర్ సర్కిల్ దగ్గర జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ నంబర్ 3 ద్వారా తెలంగాణ ఏర్పాటైందని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రాజకీయ పార్టీలకు అతీతంగా కృషి చేయాలని ఆకాంక్షించారు. త్వరలోనే తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారిని గౌరవిస్తామని మాటిచ్చారు. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకొని రాష్ట్ర ప్రజల అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. తెలంగాణ అనేది కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదని, కోట్లాదిమంది ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని చెప్పుకొచ్చారు. త్యాగాల పునాదులపై నిర్మితమైన తెలంగాణ, నేడు అభివృద్ధి సంక్షేమానికి చిరునామాగా నిలిచిందని ఉద్ఘాటించారు. తెలంగాణను ప్రజాపాలన ప్రభుత్వంలో మరింత సమానత్వంతో, మరింత ప్రగతితో ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.