
Pawan Kalyan: తెలంగాణ మీ అయ్య జాగీరా..? అంటూ ఫైర్ అయ్యారు జనసేన అధినేత పవన్ కల్యాణ్... హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో లక్షలాది మంది జనసేన కార్యకర్తలు ఉన్నారని, రాష్ట్ర ప్రజల సమస్యలపై మాట్లాడే హక్కు తమ పార్టీకి ఉందని ఆయన అన్నారు. జనసేన పార్టీని హైదరాబాద్ నడిబొడ్డునే స్థాపించామని గుర్తు చేసిన పవన్ కల్యాణ్, తెలంగాణపై తమకు కొత్తగా ప్రేమ పుట్టలేదని చెప్పారు. తెలంగాణ గురించి జనసేన ఎందుకు మాట్లాడుతోందని కొందరు ప్రశ్నిస్తున్నారని, అయితే రాష్ట్ర ప్రజల సమస్యలపై స్పందించడం రాజకీయ పార్టీగా తమ బాధ్యత అని పేర్కొన్నారు. తాను తెలంగాణలోని నాలుగు మూలలూ తిరిగానని, రాష్ట్ర అభివృద్ధిని ఎప్పుడూ కోరుకునే వ్యక్తినని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆదిలాబాద్ వంటి నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా పర్యటించానని, ప్రస్తుతం విమర్శలు చేస్తున్న చాలామంది అప్పట్లో అక్కడికి వెళ్లలేదని వ్యాఖ్యానించారు. తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని, రాష్ట్ర విభజన జరిగిన విధానంపైనే తన అభ్యంతరం అని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు, నాయకులకు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఎలాంటి విద్వేషం లేదని పవన్ కల్యాణ్ అన్నారు. అయితే హైదరాబాద్లో ఎలా అడుగుపెడతారని కొందరు ప్రశ్నించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తెలంగాణ ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదని, ఎవరూ తనను బెదిరించలేరని వ్యాఖ్యానించారు. తన ఇంటి చిరునామా చెప్పడానికే ప్రెస్మీట్ పెట్టానని, బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. గత 12 ఏళ్లలో కేసీఆర్ లేదా తెలంగాణ నాయకులపై తాను వ్యక్తిగత విమర్శలు చేయలేదని పవన్ కల్యాణ్ తెలిపారు. తనను గతంలో వైఎస్సార్సీపీ నాయకులు బెదిరించారని, కానీ తెలంగాణ ప్రజల నుంచి అలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదని చెప్పారు. తెలంగాణలో ఉపాధి అవకాశాల కొరత లేదా ప్రజా సమస్యలపై మాట్లాడితే తనను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఎవరైనా అన్యాయాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అందులో తాను ఉన్నా మినహాయింపు అవసరం లేదని పేర్కొన్నారు. తనపై భూకబ్జా ఆరోపణలు వస్తే వెంటనే విచారణ జరపాలని పవన్ కల్యాణ్ సవాల్ విసిరారు. తాను చెరువు లేదా ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఉంటే ఆస్తులను సీజ్ చేయాలని, చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజాగాయకుడు గద్దర్ గురించి ప్రస్తావించిన పవన్ కల్యాణ్, ఆయన జీవించి ఉన్న సమయంలో చాలా మంది పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న సమయంలో గద్దర్ తనను సహాయం కోరగా, తాను వెంటనే వాహనం కొనిచ్చానని గుర్తు చేశారు. తెలంగాణలో జనసేన పార్టీ తప్పకుండా ఉంటుందని, భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అవసరమైతే తానే తెలంగాణ అంతటా పర్యటిస్తానని, ప్రజా సమస్యలపై ఇదే విధంగా మాట్లాడుతూనే ఉంటానని తెలిపారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమని, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.




