translateexpand_more

Pawan Kalyan Speech News

Latest updates from Telugu Digital news sources.

Asianet News Telugu02 Jun, 02:32 pm
తెలంగాణ మీ జాగిరా.? పూర్తిగా ఓపెన్ అయిన ప వ న్ క ళ్యాణ్

తెలంగాణలో జనసేన పార్టీ కార్యకలాపాలు కొనసాగుతాయని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు తెలంగాణలో పార్టీ విస్తరణపై తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పినా, పార్టీ కార్యకర్తలు, మద్ధతుదారుల అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో ఎన్నికల బరిలోకి దిగే అవకాశాన్ని సూచించారు. ప్రజలు కోరుకుంటే తెలంగాణలో కూడా పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమైతే జనసేన ఆ బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై సహజసిద్ధమైన వ్యతిరేకత లేదని పవన్ అన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు దశాబ్దాలుగా కలిసి జీవిస్తున్నారని, ఉద్యోగాలు, వ్యాపారాలు, సినీ రంగం వంటి అనేక రంగాల్లో పరస్పర సహకారం కొనసాగుతోందని చెప్పారు. కొంతమంది రాజకీయ నాయకులు లేదా వ్యక్తులు ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను విడదీసే రాజకీయాల కంటే అభివృద్ధి, ఉపాధి, సంక్షేమ అంశాలపై చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఏమైనా ఇక్క‌డి రాజ‌కీయ నాయ‌కుల జాగీరా అంటూ ప్ర‌శ్నించారు. తనను తెలంగాణకు రావొద్దని కొందరు హెచ్చరిస్తున్నారని, కానీ అలాంటి వ్యాఖ్యలకు తాను వెనక్కి తగ్గబోనని పవన్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఏ రాష్ట్రానికైనా వెళ్లే హక్కు ప్రతి భారతీయుడికి ఉందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా ఎదుర్కొన్న ఒత్తిళ్లు, బెదిరింపులతో పోలిస్తే ఇవి పెద్ద విషయాలు కాదని వ్యాఖ్యానించారు. భయపెట్టి రాజకీయంగా అణచివేయాలనే ప్రయత్నాలు ఫలించవని చెప్పారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి మీడియా సమావేశం Live Link: https://t.co/Y6j4NhJdgl #PawanKalyanTelanganaPressMeet#TelanganaFormationDay#JanaSenaTelangana#JaiTelangana తెలంగాణతో తనకు భావోద్వేగ అనుబంధం ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమం, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తానని చెప్పారు. గతంలో కూడా తెలంగాణ ప్రాంతంలోని పలు సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తనవంతు సహాయం అందించానని గుర్తు చేశారు. ప్రజల సమస్యలు ఎక్కడ ఉన్నా వాటిపై స్పందించడం తన బాధ్యతగా భావిస్తానని అన్నారు. తెలంగాణలో జరిగే అన్యాయాలపై కూడా అవసరమైతే గళమెత్తుతానని స్పష్టం చేశారు. రాష్ట్ర ఏర్పాటై దశాబ్దానికి పైగా గడిచిన తరువాత కూడా కొన్ని సమస్యలకు ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలను కారణంగా చూపడం సరైన విధానం కాదని పవన్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఉపాధి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాంతీయ విభేదాల కంటే ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల ముఖ్యమని చెప్పారు. రాజకీయ పార్టీలు ప్రజల మధ్య విభజనలు సృష్టించే బదులు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. పవన్ కల్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీశాయి. తెలంగాణలో జనసేన భవిష్యత్తు పాత్ర, పార్టీ విస్తరణ అవకాశాలు, ప్రాంతీయ రాజకీయాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రానున్న రోజుల్లో జనసేన తెలంగాణలో ఎలాంటి కార్యాచరణ చేపడుతుందనేది ఆసక్తికరంగా మారింది.

Samayam Telugu02 Jun, 12:45 pm
ఏపీ-తెలంగాణ హైవేకు ఆ మాజీ సీఎం పేరు పెట్టాలి.. పవన్ కళ్యాణ్ కీలక ప్రతిపాదన

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న మాటల యుద్ధం సందర్భంగా జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను కించపరిస్తే, అవమానించేలా వ్యాఖ్యలు చేస్తే.. తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ నేతల విగ్రహాలను కూల్చేస్తామని.. పలువురు తెలంగాణ నేతలు హెచ్చరించిన నేపథ్యంలో.. తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో పలువురు అడిగిన ప్రశ్నలకు పవన్ కళ్యా్ణ్ స్పందించారు. ఎవరి విగ్రహాలు పెట్టాలి వద్దు అనేది ప్రజల ఇష్టం అని తెలిపారు. అలా అనుకుంటూ పోతే.. స్వాతంత్య్రాన్ని సాధించిన గాంధీజీ, అంబేడ్కర్ వంటి మహనీయుల విగ్రహాలను కూడా పెట్టొద్దని.. కొందరు వాదిస్తారని పేర్కొన్నారు. తెలంగాణలోని కొంతమంది నాయకులు.. ప్రాంతీయవాదాన్ని బాగా ప్రోత్సహిస్తున్నారని.. ఇతర రాష్ట్రాలను, ఇతర రాష్ట్రాల నేతలను ద్వేషిస్తున్నారని పవన్ కళ్యాణ్ ‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాంతీయ వాదం అనేది ఉగ్రవాదం కంటే చాలా హానికరమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఆంధ్రా నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేయవద్దంటూ కొంతమంది నేతలు, పలు సంఘాలు డిమాండ్ చేయడం, విగ్రహాల ఆవిష్కరణలను అడ్డుకోవడం వంటి ఘటనలు ఇటీవల చోటు చేసుకోవడంతో.. పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రజలు ఐక్యతకు చిహ్నం మాజీ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు అని.. ఆయన విగ్రహాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను కలిపే హైవేపై పెట్టాలని.. ఆ హైవేకు బూర్గుల రామకృష్ణారావు పేరు పెట్టాలని తాను ప్రతిపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. గొప్ప నేతల విగ్రహాలు వారి గుర్తులుగా ఏర్పాటు చేస్తారని.. అలాంటి నాయకులకు ప్రాంతీయ బేధాలు ఏంటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇలా చేసుకుంటూ పోతే.. మహాత్మాగాంధీ గుజరాత్ వ్యక్తి అని.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మహారాష్ట్ర వ్యక్తి అని.. వారి విగ్రహాలు కూడా ఏర్పాటు చేయవద్దనే వాదనలు తెరపైకి వస్తాయని.. ఇలాంటి ప్రాంతీయ విబేధాలు దేశ ఐక్యతకు మంచివి కావని సూచించారు. అదే సమయంలో తెలంగాణలో ప్రారంభమైన మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం.. తమిళనాడులో హిందీ గో బ్యాక్ డిమాండ్లు.. దక్షిణాదిన నార్త్ ఇండియన్స్ గో బ్యాక్ అని కొందరు మాట్లాడుతున్నారని.. ఇవన్నీ దేశాన్ని విచ్ఛిన్నం చేసే భావాలు అంటూ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. మనం అందరం భారతీయులం అని గుర్తు చేశారు. ఇలాంటి కేంద్రం ఫోకస్ పెట్టాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ యాస, భాషలో హిందుస్తానీ ఉందని అలాంటి తెలంగాణలో హిందీ ఉండొద్దని మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కూడా పశ్చిమ బెంగాల్‌లో ఇలాగే మాట్లాడారని.. బెంగాల్‌కు వస్తే తన్ని తరిమేస్తామని టీఎంసీ నేతలు మాట్లాడారని గుర్తు చేశారు. కానీ నాయకుల మాటలు వేరు ప్రజల మాటలు వేరని.. అక్కడి ప్రజలు టీఎంసీ నాయకులను తన్ని తరిమేశారని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

NTV Telugu02 Jun, 11:47 am
బెదిరింపులకు భయపడేది లేదు.. నేనే తెలంగాణ అంతటా తిరుగుతా.. పోటీ చేస్తాం

Pawan Kalyan: తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారకర్తగా తిరుగుతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల సమస్యలు, యువత ఉపాధి అవకాశాలపై మాట్లాడటం తన బాధ్యత అని పేర్కొన్నారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమని, ఇక్కడి ప్రజల సమస్యలపై మాట్లాడే హక్కు ప్రతి భారతీయుడికి ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే భయపడే ప్రసక్తే లేదని, భయపెట్టే కొద్దీ తన సంకల్పం మరింత బలపడుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పలువురు వ్యక్తులు నేడు ఉన్నత పదవుల్లో ఉన్నారని ఆయన గుర్తు చేశారు. యువరాజ్యం రోజుల నుంచి తెలంగాణ యువత తనకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందిస్తూ, గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని, ప్రజల మద్దతుతో వాటిని ఎదుర్కొన్నామని అన్నారు. వేర్పాటువాదం దేశ సమగ్రతకు భంగం కలిగించనంత వరకు ప్రజాస్వామ్య వ్యవస్థలో చర్చనీయాంశమేనని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. దేశంలో ఎక్కడైనా తిరిగే హక్కు ప్రతి పౌరుడికీ ఉందని, కాంగ్రెస్ నాయకులు ఇతర రాష్ట్రాల్లో రాజకీయాలు చేయవచ్చని, కానీ తాము తెలంగాణలో పర్యటిస్తే అభ్యంతరాలు వ్యక్తం చేయడం సరైన విధానం కాదని విమర్శించారు. ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేయవచ్చని, గతంలో ఇందిరా గాంధీ మెదక్ నుంచి పోటీ చేశారని గుర్తు చేసిన పవన్ కల్యాణ్, అదే విధంగా దేశవ్యాప్తంగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడం ప్రజాస్వామ్య హక్కు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ అంశాలపై స్పందించాలని కోరారు. ఇక, పాశం యాదగిరిపై తనకు గౌరవం ఉందని, అయితే ఆయన కూడా తనపై విమర్శలు చేయడం బాధ కలిగించిందని పవన్ కల్యాణ్ అన్నారు. తాము దేశ పౌరులమని, పన్నులు చెల్లిస్తున్నామని, తెలంగాణలో ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ఎలాంటి పాస్‌పోర్ట్ అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఉపాధి అవకాశాలు, యువత భవిష్యత్తు, ప్రజా సమస్యలపై చర్చిస్తుంటే వ్యక్తిగత విమర్శలు చేయడం బాధాకరమని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని, భవిష్యత్తులో కూడా తెలంగాణ ప్రజల కోసం గళం వినిపిస్తానని స్పష్టం చేశారు.